ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్‌పై రాయితీ రద్దు!

by  |
Tata Nexon
X

దిశ, వెబ్‌డెస్క్: గతవారం ప్రతిష్ఠాత్మకమైన ‘ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకున్న టాటా నెక్సాన్ సరైన మైలేజీ ఇవ్వట్లేదనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ మేరకు వినియోగదారుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు కూడా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం ఇదే కారణంతో నెక్సాన్ మోడల్ కారుకు రాయితీలను ఇవ్వడం కుదరని స్పష్టం చేసింది. దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనం నెక్సాన్ మోడల్‌ను గతేడాది మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఊపందుకుంటున్న తరుణంలో ఈ మోడల్ అత్యంత ఆదరణ దక్కించుకోవడమే కాకుండా 3,000 యూనిట్లు అమ్ముడుపోయింది. అయితే, నెక్సాన్ మోడల్ కంపెనీ సూచించిన స్థాయిలో మైలేజీ ఇవ్వట్లేదని పలువురు వినియోగదారుల నుంచి ఫిర్యాదు అందాయి.

దీన్ని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం రాయితీని తొలగించింది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగానే రాయితీ అందించే జాబితా నుంచి తొలగించినట్టు ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది. ఈ పరిణామంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకెళ్లాలని భావిస్తున్న టాటా మోటార్స్‌కు గట్టి దెబ్బ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల టాటా నెక్సాన్‌ను కొనే వినియోగదారులకు ఎలాంటి సబ్సిడీ లభించదు. టాటా నెక్సాన్ సరైన ప్రామాణికతను కలిగి లేదని, కంపెనీ సూచించిన స్థాయిలో ఒక ఛార్జ్‌కి నిర్దేశించిన డ్రైవింగ్ రేంజ్ అందుకోలేదని రవాణా శాఖ పేర్కొంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అధికమైన నేపథ్యంలో కంపెనీకి గత నెలలో షోకాజ్ నోటీసులను ఇచ్చామని, అయితే కంపెనీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, తుది నివేదిక రావాల్సి ఉందని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాత్ వెల్లడించారు.


Next Story