ఢిల్లీ బడ్జెట్: విద్య, వైద్యంపై ఫోకస్

by  |
ఢిల్లీ బడ్జెట్: విద్య, వైద్యంపై ఫోకస్
X

న్యూఢిల్లీ : కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 69వేల కోట్ల ఈ బడ్జెట్ థీమ్‌ను దేశ భక్తిగా ప్రకటించింది. ఈ బడ్జెట్ ప్రధానంగా విద్య, వైద్యంపై ఫోకస్ పెట్టింది. అలాగే, మరో పాతిక సంవత్సరాల తర్వాత పరిస్థితులను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్‌లో చోటిచ్చామని ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఈ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. బడ్జెట్‌లో సుమారు పావు వంతు భాగం (రూ. 16,377 కోట్లు) విద్యా రంగానికే కేటాయించారు. విద్య అనేది మాస్ మూవ్‌మెంట్ అవ్వాలని అన్నారు. ఈ బడ్జెట్‌లో వర్చువల్ మోడల్ స్కూళ్ల ప్రతిపాదన చేశారు. ఇందులో భవనాలు ఉండవని, కానీ, ఎవ్వరైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ లా యూనివర్సిటీకీ శంకుస్థాపన చేస్తామని వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య రంగానికి ఢిల్లీ ప్రభుత్వం రూ. 9934 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. మహిళలకోసం నగరవ్యాప్తంగా మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటుచేస్తామని వివరించారు. అలాగే, నగరవ్యాప్తంగా రూ. 45 కోట్లతో 500 త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేయడానికి సంకల్పించినట్టు తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం రానున్న తరుణంలో ప్రజల్లో దేశభక్తిని మరింత కలుగజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఏడాది పొడుగునా భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని తెలియజేసే కార్యక్రమాలను చేపడతామని, వీటికి రూ. 20 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. 2047 వరకు ఢిల్లీ ప్రజల తలసరి ఆదాయానికి సింగపూర్ వాసుల తలసరి ఆదాయానికి సమంగా పెంచుతామని వివరించారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఈ-వెహికిల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేస్తామని సిసోడియా చెప్పారు.


Next Story

Most Viewed