కేజ్రీవాల్‌తో కలిసే పోరాడుతాం : అమిత్ షా

by  |
కేజ్రీవాల్‌తో కలిసే పోరాడుతాం : అమిత్ షా
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని, ఈ విషయంలో భయభ్రాంతులకు లోనుకావలసిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జోస్యం చెప్పినట్టు జూలై చివరికల్లా 5.5 లక్షల కేసులు నమోదుకాబోవని, ఆయన అనవసరమైన భయాన్ని సృష్టించారని అన్నారు. డిప్యూటీ సీఎం వాదనతో తాను ఏకీభవించబోనని తెలిపారు. కచ్చితంగా ఢిల్లీలో అన్ని కేసులు రిపోర్ట్ కావని, కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటున్నది కాబట్టి జూలై చివరికల్లా ఇక్కడ మరింత మెరుగైన పరిస్థితులే ఉంటాయని వివరించారు. ఢిల్లీలో కరోనా కట్టడి కోసం అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు అండగా నిలవాలని ప్రధాని మోడీ సూచించారని, అటు తర్వాతే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో అందరికీ పరీక్షలు జరపాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకోగలిగామని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమన్వయంలో ఉన్నామని, ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ప్రతి నిర్ణయంలో ఆయన తన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కొన్ని నిర్ణయాల్లో వివాదాలు తలెత్తినా కరోనాపై కలిసే పోరాడుతున్నామని వివరించారు. కాగా, కరోనాతో మరణించిన పేషెంట్ల మృతదేహాలపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 350 మృతదేహాలు అంత్యక్రియల కోసం పెండింగ్‌లో ఉన్నాయని, రెండు రోజుల్లో వారివారి మత ఆచారల ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహిస్తామని తెలిపారు. ఇక నుంచి ఏరోజు మృతదేహాలకు అదే రోజులు అంతిమ సంస్కారాలు జరుగుతాయని అన్నారు.

Next Story

Most Viewed