పత్తి‘ రైతు’ పరేషాన్.. తగ్గనున్న దిగుబడి

by  |
పత్తి‘ రైతు’ పరేషాన్.. తగ్గనున్న దిగుబడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్​ లో పత్తి పంట వేసిన రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్టు స్వయంగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తున్నది. ప్రతీ ఏటా ఎకరాకు 5 క్వింటాల్​పండగా, 2021–22 ఖరీఫ్ లో కేవలం 2.33 క్వింటాల్​మాత్రమే పండినట్టు పేర్కొన్నది. భారీ వర్షాల ప్రభావంతోనే ఈ పరిస్థితులు వచ్చాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది. వాస్తవానికి ఈ సారి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, 50 లక్షల్లో మాత్రమే పత్తి పంట పండినట్టు వ్యవసాయ శాఖ వివరించింది. వీటి ద్వారా కేవలం 69.46 లక్షల బేల్స్ వస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే వీటిని వచ్చే నెల నుంచి సీసీఐ(కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా) కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన ఈ సారి రైతులు నష్టపోయే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖలోని ఓ అధికారి ‘దిశ’ తెలిపారు. ఇప్పటికే పత్తి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కోరినట్టు ఆయన వెల్లడించారు.

పప్పుల ఉత్పత్తి 5.80 లక్షల టన్నులు..

పత్తి పంటతో పాటు పప్పులు ఉత్పత్తి కూడా తగ్గినట్టు అగ్రి ఆఫీసర్లు పేర్కొన్నారు. ఖరీప్​ లో ఏడు లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, కేవలం 5.80 లక్షలు టన్నులు మాత్రమే వచ్చినట్టు స్పష్టం చేశారు. దీనిలో కందుల ఉత్పత్తి 5.32 లక్షల టన్నులు, పెసలు 32 వేల టన్నులు, మినుములు 16 వేల టన్నులుగా ఉన్నది.

వరి అత్యధికంగా...

ఈ ఖరీఫ్ లో వరి పంట ఉత్పత్తి అత్యధికంగా ఉన్నది. 21.06 లక్షల ఎకరాల్లో 91.96 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లు పేర్కొన్నారు. కానీ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మన వాతావరణ పరిస్థితుల్లో వరి తప్ప మరే ప్రత్యమ్నాయ పంట సరిగ్గా పండటం లేదని స్వయంగా అధికారుల పరిశీలనలోనే తేలింది. దీంతో వరికి ప్రత్యమ్నాయంగా ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయోనని రైతులు మదనపడుతున్నారు.
ఖరీఫ్​ లో పంట ఉత్పత్తి ఇలా..
బియ్యం 91.96 లక్షల టన్నులు
జొన్నలు 22 వేల టన్నులు
మొక్కజొన్న 11.37 లక్షల టన్నులు
కందులు 5.32 లక్షల టన్నులు
పెసలు 32 వేల టన్నులు
మినుములు 16 వేల టన్నులు
సోయాబీన్ 2.43 లక్షల టన్నులు
పత్తి 69.46 లక్షల బేల్స్



Next Story

Most Viewed