చనిపోయాడని అంత్యక్రియలు.. 3 నెలల తర్వాత తిరిగి ఇంటికి

by  |
చనిపోయాడని అంత్యక్రియలు.. 3 నెలల తర్వాత తిరిగి ఇంటికి
X

దిశ, వెబ్‌డెస్క్: చనిపోయాడనుకుని ఒక వ్యక్తికి కుటుంబ సభ్యలు అంత్యక్రియలు జరిపారు. కానీ 3 నెలల తర్వాత తిరిగి ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఇది చూసి కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల నోట్లోనుంచి మాట రాలేదు.

కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాబూ అనే అతడికి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉంది. తాను పనిచేస్తున్న హోటల్‌లో సాబూ దొంగతనానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో గత ఏడాది నవంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు సాబూ గురించి పట్టించుకోవడం మానేశారు. అతడి యోగక్షేమాలను తెలుసుకోవడం కూడా వదిలేశారు.

అయితే గత ఏడాది డిసెంబర్ 24న కొట్టాయం జిల్లా పాలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా.. చనిపోయిన వ్యక్తి సాబూనేనని పోలీసులు తప్పులో కాలేసి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా సాబూదేనని పొరపడి అంత్యక్రియలు పూర్తి చేశారు.

కానీ గత శుక్రవారం స్థానికంగా ఒక బస్ డ్రైవర్ రోడ్డుపై వెళ్తున్న సాబూని గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సాబూని కుటుంబసభ్యుల దగ్గరకు చేర్చారు. తాము పొరబడి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి సాబూనేనని అనుకున్నామని, ఇప్పుడు తప్పు తెలుసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

Next Story