‘అక్కా.. నా పిల్లల్ని మంచిగ చూస్కో అంటూ..’

by  |
‘అక్కా.. నా పిల్లల్ని మంచిగ చూస్కో అంటూ..’
X

దిశ, సికింద్రాబాద్: అప్పుల బాధలు తాళలేక తీవ్ర మనో వేధనకు గురైన ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు అప్పులిచ్చిన వారి వేధింపులే కారణమంటూ తన అక్కకు సెల్ ఫోన్‌లో సెల్ఫీ విడియో తీసి సందేశం పంపించాడు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అడ్డగుట్ట ఏ సెక్షన్‌కు చెందిన దండు కిరణ్(35) తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. సికింద్రాబాద్ అంజలి టాకీస్ వద్ద ఉన్న చెరుకు గోడౌన్ నుంచి షాపులకు చెరుకు సప్లై చేస్తూ… వ్యాపారం చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్‌లో బిజినెస్‌లో పూర్తిగా నష్టం వచ్చింది.

దీంతో తెలిసిన వారి వద్ద భారీగా అప్పులు చేశాడు. ఈ క్రమంలో గతకొద్ది రోజులుగా అప్పులిచ్చిన వారు నిత్యం కిరణ్‌ను వేధింపులకు గురి చేశారు. అంతేగాకుండా మూడ్రోజుల క్రితం వారు కిరణ్ ఇంటికి వచ్చి బస్తీలో గొడవ చేశారు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన కిరణ్ భార్య మంజుల తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కిరణ్ తన పిల్లలను బాగా చూసుకోవాలని, తన అక్కకు చెబుతూ సెల్ఫీ విడియో తీసి పంపించాడు. ఆ తరువాత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి కిరణ్‌కు భార్య మంజుల ఫోన్ చేయగా, కిరణ్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంత ఇంటికి వెళ్ళి చూడగా కిరణ్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed