పదేండ్ల తర్వాత మళ్లీ వస్తున్నారు.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో డెడ్లీ కాంబినేషన్

by  |
పదేండ్ల తర్వాత మళ్లీ వస్తున్నారు.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో డెడ్లీ కాంబినేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్.. టగ్ ఆఫ్ వార్ మ్యాచ్.. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉంది ఎవరనుకుంటున్నారు రాహుల్ ద్రవిడ్.. అదెంటీ రాహుల్ హెడ్ కోచ్ అయి ఉండి మైదానంలోకి ఎందుకొచ్చాడా అని ఆశ్చర్యపోతున్నారా..? ఈ విషయం ఇప్పటిది కాదండీ.. ద్రవిడ్ చివరి సారి 2011లో ఆడిన ODI గురించి చెబుతున్నా.. ఇప్పుడా విషయం ఎందుకంటే ఫైర్ బ్రాండ్‌ కోహ్లీ కూడా అదే మ్యాచ్‌లో సెంచరీ చేసి మెరిశాడు.

ఆ రోజు ఏం జరిగింది..

సెప్టెంబరు 16, 2011న ఇండియా‌.. అతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో 5th ODI ఆడుతోంది. తొలుత బ్యాటింగ్‌ దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పార్థివ్ పటేల్ (19), అజింక్య రహానే (26) చేతులెత్తేశారు. మూడో బ్యాటర్‌గా క్రీజులో రాహుల్ ద్రవిడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఏకధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 69 పరుగుల వద్ద గ్రేమ్ స్వాన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక చివరి ODIలో కరతాళ ధ్వనుల మధ్య పెవిలియన్‌కు వెళ్లాడు.

ఇదే సమయంలో స్టార్ బ్యాటర్..

ఇక ఇదే సమయంలో క్రీజులో పాతుకుపోయిన ఓ యువ బ్యాటర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టించాడు. 107 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకుని మైదానం వీడాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు.. ప్రపంచ క్రికెట్‌లోనే తనదైన ముద్రవేసిన.. కని విని ఎరుగని రికార్డులు సొంతచేసుకుని.. రన్ మిషిన్‌గా పేరు గాంచిన విరాట్ కోహ్లీ.

పదేండ్ల తర్వాత మళ్లీ మైదానంలోకి..

ఇక తన చివరి ODI తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ద్రవిడ్‌.. క్రికెట్ రంగంలో అంచలంచెలుగా ఎదిగాడు. తొలుత అండర్‌ 19 జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తూ.. ఎంతో మంది యువ క్రికెటర్లను జాతీయ జట్టుకు పరిచయం చేశాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌ కోచ్‌‌గా విశిష్ట సేవలు అందించాడు. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవి కాలం ముగియడంతో టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగానే.. రాహల్ ద్రవిడ్ పేరు అనౌన్స్ చేసింది బీసీసీఐ.

ద్రవిడ్ హెడ్‌ కోచ్‌‌గా అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌‌లో తన ముద్ర వేశాడు. ప్రత్యర్థి కివీస్‌‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, టెస్టు సిరీస్‌ మాత్రం సవాల్‌గా మారింది. దీనికితోడు తొలి టెస్టు డ్రా కావడంతో ఇరు జట్లు రెండో మ్యాచ్‌పైనే ఫోకస్ చేశాయి. ఈ సమయంలో రెండో టెస్టు మ్యాచ్‌కు విరాట్ కెప్టెన్‌గా రావడం విశేషం. ఇక ద్రవిడ్‌ భారత ప్రధాన కోచ్‌గా వచ్చాక కోహ్లీతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. దీంతో ఆ మ్యాచ్ అంచనాలు అభిమానుల్లో మరింత పెరిగాయి.

ముఖ్యంగా ఒకే జట్టులో ఉన్న ఆటగాళ్లు.. పస్తుతం ఒకరు కోచ్‌‌గా, మరొకరు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ దాదాపు పదేండ్ల తర్వాత ఒకే డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం డెడ్లీ కాంబినేషన్. ఒకరేమో దూకుడు‌, ఫైర్‌ బ్రాండ్‌కు మారుపేరు. మరొకరు ఓపికకు పెట్టినపేరు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ అనేది ఆసక్తికరంగా మారనుంది. మరి ఇలాంటి కాంబినేషన్‌లో వీరిద్దరు కలిసి భారత జట్టుకు ఎలాంటి విజయాలు అందిస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదరుచూస్తున్నారు. అభిమానుల ఉత్కంఠకు తెరపడాలంటే రెండో‌ టెస్టు మ్యాచ్‌ ఫలితం వరకు వేచిచూడాల్సిందే.


Next Story

Most Viewed