రేపు సాయంత్రంతో ముగియనున్న డెడ్‌లైన్

by  |
Intermediate Board
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు వారి ఆప్షన్లను సమర్పించడానికి బుధవారం సాయంత్రం వరకు గడువు ఇస్తున్నట్లు కమిషనర్ ఒమర్ జలీల్ సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగులందరికీ ఈ సూచనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఏ జోన్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారో, అందుకు తగిన ప్రత్యేకమైన కారణాలు ఏమున్నాయో ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌కు డిసెంబరు 15వ తేదీ మధ్యాహ్నంకల్లా నకలు ప్రతులతో సమర్పించాలని స్పష్టం చేశారు. పూర్వ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఏయే జిల్లాల్లోకి వెళ్లాలో విభజన ప్రక్రియ జరుగుతున్నదని, ఇది సజావుగా జరిగేందుకు ఏడు జోన్లకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను కూడా నియమించినట్లు తెలిపారు.

ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ నెల 16వ తేదీ కల్లా ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లను సేకరించే ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నది. ఆ జాబితాను సాధారణ పరిపాలనా శాఖకు పంపాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్ దగ్గరకు ఆ శాఖలోని మొత్తం ఉద్యోగుల వివరాలు అందిన తర్వాత నిర్దిష్టమైన పార్మాట్‌లో సమర్పించడానికి ఒక రోజు సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఒమర్ జలీల్ తాజా సర్క్యులర్‌ను జారీ చేశారు. అన్ని విభాగాల నుంచి వచ్చే జాబితాను, ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు, జోన్‌లు, మల్టీజోన్‌లకు ఉద్యోగుల కేటయింపు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి మొదలవుతుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ఉద్యోగులకు పంపిణీ కావడం మొదలవుతుంది.

Next Story

Most Viewed