వలస కార్మికులతో వెళ్తున్న డీసీఎం సీజ్

by  |

దిశ, మేడ్చల్: లాక్‌డౌన్ వేళ వలస కార్మికులతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనాన్ని పోలీసులు సీజ్ చేసిన ఘటన జిల్లాలోని బాచుపల్లి చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో చందానగర్‌లో ఉంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు.. ఎలాగైనా స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ డీసీఎంను కిరాయికి మాట్లాడుకుని బయలుదేరారు. అయితే, వీరి వాహనం బాచుపల్లి చౌరస్తా వద్దకు రాగానే పోలీసులు ఆపారు. తనిఖీలు చేయగా, వలస కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వలస కార్మికులను ఓ ప్రైవేటు వాహనంలో తిరిగి చందానగర్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక.. తినడానికి తిండిలేక పస్తులు ఉంటున్నామనీ, ప్రభుత్వం అందిస్తామన్న నిత్యావసర సరుకులు, డబ్బులు తమకు అందలేదని కార్మికులు వాపోయారు. అధికారులతో మాట్లాడి వీరికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని స్థానిక సీఐ జగదీశ్వర్ తెలిపారు.

Tags: Migrant workers, dcm van, chanda nagar, bachupally

Next Story