రియల్ వ్యాపారికి లైన్‌క్లియర్ !

by  |
రియల్ వ్యాపారికి లైన్‌క్లియర్ !
X

రంగారెడ్డి, దిశ: ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి రియల్ వ్యాపారికి దక్కనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. డీసీసీబీ వైస్ చైర్మన్, డీసీఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. డీసీసీబీ చైర్మన్ పదవి కోసం మంగళవారం సుమారు 8 మంది నామినేషన్లు వేయగా చివరికి వీరిలో ఒకరు మాత్రమే బరిలో ఉండే అవకాశముంది. అందులో బి.మనోహర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల భోగట్టా.

అధిష్టాన నిర్ణయమే ఫైనల్..
డీసీసీబీ చైర్మన్ పదవిని తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసులకు టీఆర్ఎస్ పెద్దలు పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదనే మాటలు వినబడుతున్నాయి. పైగా చైర్మన్ అభ్యర్థిని అధిష్టానమే ఫైనల్ చేసి సీల్డ్ కవర్లో పేర్లు పంపిచనుందని సమాచారం. అధిష్టాన నిర్ణయానికి జిల్లా నాయకులు కట్టుబడి పనిచేయాల్సిందేనని, మాట వినని నాయకులపై వేటు వేసేందుకైనా అధిష్టానం వెనకంజ వేయదనే సంకేతాలు వెలువడటంతో నాయకులు తమ అనుచరులకు చైర్మన్ పదవిపై ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నారు.

జిల్లాలవారీగా పదవుల పంపిణీ
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన డీసీసీబీ చైర్మన్ ఎన్నిక ఉండనున్న నేపథ్యంలో విడిపోయిన జిల్లాలవారీగా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి వికారాబాద్ జిల్లాకు దక్కితే, వైస్ చైర్మన్ మేడ్చల్‌కుగానీ, రంగారెడ్డి జిల్లా నాయకులకుగానీ దక్కే అవకాశం ఉంది. డీసీసీబీ వైస్ చైర్మన్ పదవి దక్కని జిల్లాకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా అందరి కన్ను డీసీసీబీ చైర్మన్‌పైనే ఉండటంతో జిల్లాలోని ప్రధాన నాయకులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రేసులో ఉన్న అభ్యర్థుల పేర్లు ఇప్పటికే సూచించారు. అంతిమ నిర్ణయం అధిష్టానిదే కానుండగా కేటీఆర్‌ సైతం కుల్కచర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed