దత్తాత్రేయ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఎన్నికల్లో ‘విజయ’మే టార్గెట్!

by  |
Bandaru Vijayalakhsmi
X

దిశ, తెలంగాణ బ్యూరో : క్రియాశీల రాజకీయాల్లోకి తన కూతురిని దింపేందుకు హర్యానా గవర్నర్​బండారు దత్తాత్రేయ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా దత్తన్న రంగంలోకి దిగారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ప్రతిఏటా పార్టీలకతీతంగా అందరినీ ఏకం చేసేందుకు దత్తాత్రేయ అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీల ద్వారా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానాలు అందించేవారు. కానీ ఈ ఏడాది అందుకు విభిన్నంగా ప్రతి ఒక్కరికీ దత్తన్న కూతురు విజయలక్ష్మి స్వయంగా వెళ్లి ఆహ్వానించడం గమనార్హం. దీన్ని బట్టి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ ​కాబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్న విజయలక్ష్మి పార్టీ ఆదేశించిన పనులు ఏదైనా సరే చేసేందుకు సిద్ధమే అని ప్రకటించడంతో ఈ ఊహాగానాలకు మరింత స్పష్టత లభించినట్లయింది.

అలయ్-బలయ్ వేదికగా బిడ్డను ప్రమోట్​ చేయాలని బండారు దత్తాత్రేయ ప్లాన్​ చేసినట్లు సమాచారం. అయితే ఆయన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండటం వల్ల పూర్తిస్థాయి బాధ్యతలను తన కూతురు విజయలక్ష్మికి అప్పగించారనే ప్రచారం జరిగినప్పటికీ బిడ్డ రాజకీయ భవిష్యత్​ కోసమే ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ఇదిలా ఉండగా 2019 పార్లమెంట్​ఎన్నికల్లో దత్తన్న తన వియ్యంపుడు జనార్దన్​రెడ్డికి బీజేపీ టికెట్ ఇప్పించారు. కానీ ఆయన ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆనాటి నుంచి జనార్దన్​రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సొంత బిజినెస్ ​పనుల్లో ఆయన బిజీ అవ్వడంతో రాజకీయాలపై ఫోకస్ ​చేయలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కూతురు విజయలక్ష్మిని తన రాజకీయ వారసురాలిగా తీసుకురావాలని బండారు దత్తాత్రేయ ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయలక్ష్మి ఎక్కడి నుంచి పోటీకి దిగాలో తేల్చుకునే పనిలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ ​నడుస్తోంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్​ స్థానం నుంచి పోటీ చేయాలా? లేక చేవెళ్ల నుంచి పోటీలోకి దిగాలా అనే డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్​పార్లమెంట్ స్థానంలో ఉండగా.. అక్కడ ఆమెకు అవకాశం వస్తుందో లేదో అనే అనుమానాలున్నాయి. అందుకే చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి పోటీచేసే యోచనలో విజయలక్ష్మి ఉన్నట్లు సమాచారం. ఒక వేళ ఈ రెండు స్థానాల్లోనూ పార్టీ నిరాకరిస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగాలని విజయలక్ష్మి ప్లాన్​చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా విజయలక్ష్మి కొద్ది కాలంగా బండి సంజయ్​పాదయాత్రలోనూ చురుకుగా పాల్గొన్నారు. పార్టీ తరుఫున నిర్వహించే ప్రతి ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతున్నారు. సాధారణంగా ఇతర పార్టీల్లో అయితే రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. కానీ బీజేపీ కుటుంబ పాలనకు పెద్దగా ప్రియారిటీ ఇవ్వదని పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. కష్టపడిన వారికే బీజేపీలో ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే ఇప్పటి నుంచే విజయలక్ష్మి తన కార్యాచరణను ప్లాన్​చేసుకుంటున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed