కొత్త హోర్డింగ్ పాలసీపై దాసోజు శ్రవణ్ ఫైర్

by  |
కొత్త హోర్డింగ్ పాలసీపై దాసోజు శ్రవణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో సొంత డబ్బులతో ఫ్లెక్స్ లు కట్టి పోరాడిన తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ నోట్లో మన్ను కొట్టే విధంగా కొత్త హోర్డింగ్ పాలసీ తీసుకొచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త హోర్డింగ్స్ పెట్టుకోమని చెప్పి వెంటనే రాత్రిరాత్రికి హోర్డింగ్స్ తీసేసే విధంగా ఆదేశాలు ఇచ్చారని, దీంతో దానిపై ఆదారపడ్డ 20 వేల కుటుంబాలని రోడ్డుకీడ్చారని దుయ్యబట్టారు. తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ వారు హోర్డింగ్స్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పి ఆంధ్ర హోర్డింగ్ అసోసియేషన్ వారికి మాత్రం హోర్డింగ్స్ పెట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించి వారి దగ్గర జీహెచ్ఎంసీ అధికారులు కమీషన్లు తీసుకుని దందా చేస్తున్నారని ఆరోపించారు. ఇంత దుర్మార్గం ఎందుకు ? అని నిలదీశారు.

జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ఫిల్మ్ నగర్, తెలంగాణ భవన్ పరిసరాల ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్స్ , ఫ్లెక్స్ లు కడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారా ? అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చెందిన ఎవరైనా ఫ్లెక్స్ కడితే నో హోర్డింగ్ , ఫ్లెక్స్ పాలసీ పేరు చెప్పిన వెంటనే తొలగించేస్తారని, గత రెండు రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో ఓ నాయకుడు చేరిక ఉందనే నెపంతో హోర్డింగ్స్ పెడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హోర్డింగ్స్ పెట్టిన వారికి ఫైన్ ఎందుకు వేయడం లేదు ? ఇంత పక్షపాతమా ? టీఆర్ఎస్ కి ఒక చట్టం, మిగతా ప్రజలు మరో చట్టామా ? ఇదే రాజ్యం ? అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed