కేటీఆర్​ వారిని మభ్యపెడుతున్నారు -దాసోజు శ్రవణ్​

by  |
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ, టీఆర్​ఎస్ నాయకులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్​ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభన్​లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజలకు, నిరుద్యోగులకు చేసిందేం లేదని, కేవలం పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే మంత్రి కేటీఆర్​ వరుస ట్వీట్లు చేస్తూ ఓటర్లను తీవ్రంగా మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ లేక బీజేపీ, టీఆర్​ఎస్ ​పార్టీల నడుమ నిరుద్యోగులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణను ఆర్థికంగా బలపరిచే ప్రాజెక్టుపై పార్లమెంట్​లో కనీసం చర్చ కూడా చేపట్టలేదు. ఐటీఐఆర్ ​ప్రాజెక్టు వచ్చి ఉంటే లక్షలాది మంది తెలంగాణ యువతకు ఐటీలో ఉపాధి అవకాశాలు దొరికేవని దాసోజు పేర్కొన్నారు. 2018లో ఈ ప్రాజెక్టును రద్దు చేసినట్లు కేంద్రం ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ లేఖను విడుదల చేస్తే 2021లో ప్రాజెక్టు పై కేటీఆర్ లేఖరాయడం సిగ్గు చేటని విమర్శించారు. అది కూడా ఐటీఐఆర్ వద్దని, అదే స్థానంలో మరో ప్రాజెక్టు ఇవ్వమని లేఖ రాశారని, ఇది కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల జిమ్మిక్కులో భాగమేనని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు ఖర్చుచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్​ప్రాజెక్టు కోసం రూ.13 వేల కోట్లు వెచ్చించకపోవడం టీఆర్​ఎస్​ అసమర్థ పాలనకు నిదర్శమని దాసోజు దుయ్యబట్టారు.

కేంద్రంపై యుద్ధం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం

ఐటీఐఆర్​ ప్రాజెక్టు సాధనకు కేంద్రంపై యుద్ధం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉందని, అవసరమైతే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కలిసి ప్రధాని మోడీ ఇంటి ఎదుట బైఠాయిస్తామని దాసోజుస్పష్టం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలతోనే రాష్ట్రంలో ఐటీ గ్రోత్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గేమింగ్ యానిమేషన్ సెక్టార్ ను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు.

చిన్నారెడ్డికి మైనారిటీ ఉద్యోగ సంఘాల మద్దతు

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి తెలంగాణ ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వర్కర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు దాసోజు శ్రవణ్​కుమార్​ స్పష్టం చేశారు. ఈ ఎలక్షన్లో టీఆర్​ఎస్​కు ఓటు అడిగే హక్కులేదని ఆయన విమర్శించారు. టీఆర్​ఎస్​ కేవలం పింఛన్లు, రైతుబంధు పథకంతోనే ఓట్లు రాబడుతోందని, కానీ ఈ ఎన్నికల్లో పట్టభద్రులకు ఏం చేశారని ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, 2, డీఎస్సీ నోటిఫికేషన్లు వేసి ఓట్లు అడగాలని శ్రవణ్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed