బిగ్ బ్రేకింగ్ : శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

by  |
acchampet-accident
X

దిశ, అచ్చంపేట :శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లి ఏడుగురు దుర్మరణం పాలవ్వగా, ఒక్కరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా, ఉప్పునుంతల మండలం చెన్నారం గేటు వద్ద శుక్రవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. హైదరాబాద్‌లోని పటాన్ చెరు మండలం అమీన్పూర్ గ్రామం గండిగూడెం కాలనీకి చెందిన వంశీ, వెంకటేష్, కార్తీక్, నరేష్ ఏపీ 31బీ హెచ్ 2247 కారులో శ్రీశైలంకు వెళ్లి మల్లన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాదులోని సుచిత్ర ప్రాంతానికి చెందిన శివ కుమార్, సుబ్బలక్ష్మి, చారి, శివ అనే వ్యక్తులు టీఎస్ 10 యూసీ 3128 నెంబర్ గల మరో కారులో శ్రీశైలానికి బయల్దేరారు. ఈ రెండు వాహనాలు అతి వేగంగా శుక్రవారం సాయంత్రం ఉప్పునుంతల మండలం చెన్నారం గేటు వద్ద వేగంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో నరేష్ అనే వ్యక్తి మినహా మిగతా ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన నరేష్‌ను మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించారు. ఘటనా స్థలికి నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, డీఎస్పీ నర్సింలు, సీఐ అనుదీప్, ఉప్పునూతల ఎస్ఐ రమేష్ తదితరులు సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసి మృతదేహాలను తరలించారు.

సీఎం దిగ్భ్రాంతి :

దైవదర్శనం కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆ తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ముఖ్యమంత్రి మాట్లాడి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సీఎంతో పాటు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Next Story

Most Viewed