దీక్ష విరమించిన రేవంత్.. సంచలన వ్యాఖ్యలు చేసిన దామోదర రాజనర్సింహ

by  |
damodar Raja Narasimha
X

దిశ, జవహర్‌నగర్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండ్రోజుల పాటు ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష’ చేసిన విషయం తెలిసిందే. బుధవారం మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డిని దీక్షను విరమించారు. కాంగ్రెస్ కీలక నేత, ఎన్నికల మేనేజ్మెంట్ చైర్మన్ దామోదర రాజనర్సింహ రేవంత్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం తర్వాత ఒక నూతన ఉత్సాహం, ఆశ కలుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏండ్లు పోరాడాం. స్వరాష్ట్ర పాలనలో యువత కలలు సాకారం కాలేదు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు. దళిత ఔత్సాహికులకు పారిశ్రామిక ప్రొత్సాహకాలు ఇస్తామని ఇవ్వలేదు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని అదీ ఇవ్వలేదు.’’ అని విమర్శనాస్త్రాలు సంధించారు.

దళితులకు, గిరజనులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సహకారం అందిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను అంబేద్కర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రకటించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీ చేసిందని ఆరోపించారు. ప్రపంచంలో కమ్యూనిజం, క్యాపిటలిజం చూశాం కానీ, కోవర్ట్ రాజకీయం ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుతం కేసీఆర్ కోవర్ట్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదవాని వెంటే నడిచిందని, 2022 డిసెంబర్‌లోనే ఎన్నికలు రాబోతున్నాయని, రేవంత్ నాయకత్వంలో ప్రతీ కార్యకర్తా నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed