‘రెండేండ్లుగా దళితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం’

by  |
‘రెండేండ్లుగా దళితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం’
X

దిశ, మెదక్: ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి దయాసాగర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వారు మెదక్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ… గత రెండేండ్లుగా ఎస్సీ యాక్షన్ ప్లాన్ విడుదల చేయకుండా ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యం, వివక్షతను ప్రదర్శిస్తుందన్నారు. దీంతో సబ్సిడీ రుణాలు అందక లబ్దిదారులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. అదే విధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల ప్రత్యేక నిధికి రూ.12400 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.10806 కోట్లను విడుదల చేసి కేవలం రూ.6153 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఎస్టీలకు రూ.7178 కోట్లను కేటాయించి కేవలం రూ.3561 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ప్రతిఏడాది ప్రకటించే ఎస్సీ యాక్షన్ ప్లాన్ విడుదల చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన ప్రభుత్వం నేటికీ విడుదల చేయకుండా దళితులను దగా చేస్తోందని ఆరోపించారు. మంజూరైన స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ అందకపోవడంతో లబ్ధిదారులు కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారే తప్ప పనులు జరగడం లేదన్నారు.

Next Story