పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు

by  |
పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు
X

దిశ, క్రైమ్ బ్యూరో: పోలీసులకు సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. సాధారణ పౌరుల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ మోసాలకు బలవుతున్నారు. తాజాగా మోసపోతున్న వారి జాబితాలో పోలీసులు సైతం చేరుతున్నారు. గతేడాది సాధారణ క్రైమ్ రేట్ తగ్గిందని అనుకుంటుండుగా.. సైబర్ నేరాల గణాంకాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సైబర్ క్రైమ్ విభాగంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతుండగా.. పెరుగుతున్న సైబర్ నేరాలను నిరోధించడం పెద్ద సవాల్ అవుతోంది. పోలీసింగ్‌పై మాత్రమే అవగాహన ఉండే వీరికి సైబర్ నేరాలతో సాంకేతిక అంశాలపైనే శిక్షణ తప్పనిసరి అవుతోంది. మోసగాళ్లను పట్టుకోవడానికి అనేక ప్రయాసాల కోర్చి వెళ్లినా.. అక్కడి పోలీసుల మద్దతు ప్రశ్నార్థకమే అవుతోంది. దీంతో సైబర్ క్రైమ్ పోలీస్ విధులు కత్తిమీద సాములా ఉన్నాయి.

పెండింగ్ జాబితా..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ నేరాలకు, సైబర్ నేరాలకు దర్యాప్తు పూర్తి భిన్నంగా ఉంటోంది. సైబర్ నేరాలు అత్యధికంగా ఇతర రాష్ట్రాలు, దేశాల కేంద్రంగానే ఉంటున్న మోసగాళ్లను పట్టుకోవడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా అక్కడి మోసగాళ్లను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకు, ఒకే డిపార్ట్మెంట్ అయినప్పటికీ స్థానిక పోలీసులు సహకరిస్తారనే గ్యారంటీ లేదు. ఒక్కోసారి ఆ ప్రాంతాలలో నెలల తరబడి స్టే చేయాల్సి వస్తోంది. ఇక్కడ కొత్త కేసులు నమోదవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు మరిన్ని అధికం అవుతున్నాయి.

సిబ్బంది కొరత..

సైబరాబాద్ కమిషనరేట్ సీసీఎస్ లో ప్రస్తుతం 70 మంది సిబ్బంది మాత్రమే ఉండగా, మరో 50 మంది సిబ్బంది కోసం ప్రతిపాదనలను పంపారు. ఈ ప్రతిపాదనలకు ఓకే చెప్పినా ఇంకా కేటాయించలేదు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లకు ఒక్కో సీసీఎస్ పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం మంజూరు చేసినా.. అధికారులు ఇంకా ఏర్పాటు చేయలేదు. నగరంలో సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు సిబ్బందిని మరింత పెంచడంతో పాటు, వారికి నిరంతరం శిక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed