సైబర్ నేరగాళ్ల వేదిక ‘ఓఎల్ఎక్స్’

by  |
సైబర్ నేరగాళ్ల వేదిక ‘ఓఎల్ఎక్స్’
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఆన్ లైన్ ఎక్సేంజ్ (ఓఎల్ఎక్స్) క్లాసిఫైడ్ వేదికలో వస్తువుల కొనుగోలు, విక్రయాలు నిర్వహించే సంగతి తెల్సిందే. ఓఎల్ఎక్స్ వేదిక ప్రామాణికమైనదని, ఈ సైట్ లో ఉండే ఉత్పత్తులను సులువుగా కొనుగోలు చేయవచ్చని సాధారణ ప్రజలు నమ్ముతుంటారు. ప్రజల నమ్మకాన్నే పెట్టుబడిగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆధునిక పద్ధతులను ఎంపిక చేసుకుని అమాయకుల నుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలలో ఈ తరహా మోసాలపై ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు అధిక ఫిర్యాదులు అందుతున్నాయి.

ఈ-వాలెట్ చెల్లింపులకు దూరం..

తమ వద్ద ఎలాంటి ఉత్పత్తి లేకుండానే కార్లు, టూ వీలర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లాంటి వివిధ రకాల ఉత్పత్తుల అమ్మకం గురించి ఈ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రకటనలను పోస్ట్ చేస్తుంటారు. ఒక కొనుగోలుదారుడు ఓఎల్ఎక్స్ ద్వారా ఏదైనా ఉత్పత్తిని కొనాలనాలనుకున్నప్పుడు, వారు ఓఎల్ఎక్స్‌లోని ఉత్పత్తుల కోసం బ్రౌజ్ చేస్తుంటారు. ఆ సమయంలో అమ్మకందారులను సంప్రదిస్తారు. మొబైల్ నంబర్లను మార్చుకుంటూ ధరల గురించి చాట్ ద్వారా లావాదేవీలు చేయడానికి ప్రయత్నిస్తారు. తాము నిజమైన అమ్మకందారులుగానే భావించేలా మోసగాళ్లు సైనిక యూనిఫాం, నకిలీ గుర్తింపు కార్డు, ఉత్పత్తికి సంబంధించి నకిలీ రశీదు తదితర విధాలుగా కొనుగోలుదారులు నమ్మేలా ప్రవర్తిస్తారు. అనంతరం వాట్సాప్ ద్వారా చర్చలు ప్రారంభించి, ఆ మొత్తాన్ని ఈ-వాలెట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చెల్లించేందుకు అభ్యర్థనలను పంపిస్తారు. మొత్తం నగదును స్వీకరించిన తర్వాత కొనుగోలుదారుడు కాల్స్‌కు స్పందించకుండా మొబైల్‌ను స్విచాఫ్ చేస్తాడు.

డాట్ మార్గదర్శకాలు అమలు చేయాలి..

హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ పరిధిలో ఓఎల్ఎక్స్ పేరుతో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నందున ఓఎల్ఎక్స్ పై చర్యలు తీసుకోవాలని, మోసాలను నివారించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఓఎల్ఎక్స్ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. కొనుగోలుదారులు ఓఎల్ఎక్స్ ఫ్లాట్ ఫాంలను గుడ్డిగా నమ్మవద్దని, వస్తువును భౌతికంగా చూడకుండా డబ్బులను చెల్లించవద్దని సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ సూచించారు.

Next Story