తగ్గనున్న వంటనూనె ధరలు!

by  |
తగ్గనున్న వంటనూనె ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు మండుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పరిశ్రమల సంఘం ‘సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’(ఎస్ఈఏ) వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో లీటరుకు రూ.3-5 వరకు స్వచ్ఛందంగా తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

హోల్‌సేల్ ధరలపై వర్తించే విధంగా ఈ నిర్ణయం ఉంటుందని, పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం అని పరిశ్రమ సంఘం స్పష్టం చేసింది. ‘పరిశ్రమలో అధిక డ్యూటీలను ఎదుర్కొంటున్నప్పటికీ వినియోగదారుల అవసరాలను గమనిస్తున్నాం. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వంటనూనె ధరలు తగ్గాయి. దీనికి మద్దతుగానే టన్నుకు రూ.3,000-5,000 వరకు తగ్గించాలని నిర్ణయించాం’ అని ఎస్ఈఏ పేర్కొంది.

కాగా గత నెలలో ప్రభుత్వ నిర్ణయంతో పామాయిల్ ధరలు 22 శాతం వరకు తగ్గి లీటరు రూ.133కి చేరుకుంది. అలాగే వేరుశెనగ రూ. 181.97, పొద్దుతిరుగుడు రూ. 168, ఆవనూనె ధరలు రూ. 185కి తగ్గాయి.



Next Story