ఆగ్రహంగా ఉంటే నా తలనరికేయండి !

by  |
ఆగ్రహంగా ఉంటే నా తలనరికేయండి !
X

కోల్‌కతా: ఎంఫాన్ తుఫాన్‌ సృష్టించిన విలయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని, ప్రజలు సంయమనం పాటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. అధికార సిబ్బంది, ఇతర బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని, నీరు, విద్యుత్ సరఫరా కోసం శ్రమిస్తున్నామని తెలిపారు. ఈ కష్టకాలంలో కాస్త ఓపిక పట్టాలని ప్రజలను కోరుతూ చేతులెత్తి నమస్కరించారు. ఎంఫాన్ తుఫాన్ బెంగాల్‌ను ముఖ్యంగా రాజధాని నగరం కోల్‌కతాను కుదిపేసింది. దీంతో చాలా చోట్ల నీరు, విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. ఫలితంగా ప్రజలు రోడ్లమీదకొచ్చి రెండు రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. ఈ ఆందోళనలపై సీఎం స్పందిస్తూ.. ‘విద్యుత్ రాకపోవడంతో కల్‌కత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్‌కు నేనే కనీసం పది సార్లు ఫోన్ చేశాను. నాకు కూడా సరైన నెట్‌వర్క్ లేదు. ఇంటివద్ద టీవీ కూడా చూడలేకపోతున్నాను. మీరందరూ ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు. నీళ్లు, కరెంట్ లేక ఆపసోపాలు పడుతున్నారు. ఇది(ఎంఫాన్) భారీ విపత్తు. పునరావాసం, పునర్నిర్మాణం కోసం మన టీమ్స్ నిర్విరామంగా కష్టపడుతున్నాయి. చేతులెత్తి మొక్కుతున్న.. ప్రజలు సంయమనం పాటించాలి. లేదంటే చేసేదేమీ లేదు. ఆగ్రహంగా ఉంటే నా తలనరికేయండి’ అని సీఎం అన్నారు. ప్రజాగ్రహం గురించి ప్రశ్నించగా.. ఇప్పటికే కేంద్రం నుంచి ఆర్మీ సహాయాన్ని తీసుకున్నామని తెలిపారు. ఎంఫాన్ తుఫాన్‌తో రాష్ట్రంలో ఒక లక్ష కోట్లవిలువైన పంట, మౌలిక వసతుల నష్టం వాటిల్లింది. ఈ విలయానికి 86 మంది ప్రాణాలు కోల్పోయారు.



Next Story

Most Viewed