బ్యాంకుల కాడ నో సోషల్ డిస్టెన్స్!

by  |
బ్యాంకుల కాడ నో సోషల్ డిస్టెన్స్!
X

దిశ, ఆదిలాబాద్: భారత్ సహా ప్రపంచాన్ని కుదిపేస్తున్న నోవెల్ కరోనా వైరస్(కొవిడ్ 19) కట్టడికి సామాజిక దూరమే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసింది. సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం) పాటించాలని అధికార యంత్రాంగం, ప్రభుత్వం చెబుతోంది. కానీ,ఇప్పుడు అన్ని జాతీయ బ్యాంకుల వద్ద జనం సందడి పెరిగింది. లాక్‌డౌన్ వల్ల నష్టపోతున్న ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతాల్లో డబ్బులు జమ చేశాయి. దీంతో అవి తీసుకునేందుకు జనాలు గుంపులు, గుంపులుగా బ్యాంకుల వద్ద గుమిగూడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖలు జనంతో కిటకిటలాడుతున్నాయి.

ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖల వద్ద జనం గుమిగూడుతున్నారు. ప్రభుత్వం రూ.1,500 ప్రజల్లో ఖాతాల్లో జమ చేసిందన్న వార్త అందుకున్న ప్రజలందరూ ఆ డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు. ఏ బ్యాంకు వద్ద చూసినా కుప్పలు తెప్పలుగా జనం ఒకరిపై ఒకరు పడినట్లుగా బ్యాంకు పరిసరాలు ఒక్కసారి రద్దీగా మారిపోయాయి.

జనాలను గుంపులుగా ఉండకుండా అదుపు చేయడం పోలీసులకు ఇప్పుడు కత్తి మీద సాములా మారుతోంది. బ్యాంకు సిబ్బంది ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడంలేదు. బ్యాంకులకు వస్తున్న జనంలో ఎవరికీ ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉండటంతో, ఇది అత్యంత
ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఖాతాల్లో పడ్డ డబ్బులు వెంటనే తీసుకోకపోతే వెనక్కి మళ్లిపోతాయనే తప్పుడు ప్రచారంతో ఖాతాదారులు బ్యాంకులకు పోటెత్తుతున్నారని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

లాక్ డౌన్ మూలంగా రోడ్ల మీద జనాల నియంత్రణ ప్రధాన సమస్యగా ఉన్నది. రేషన్ షాపులు, కిరాణా షాపులు, కూరగాయల అంగల్లు ఇలా ప్రతి చోటా పోలీసుల అవసరం పడుతున్నది. ఇప్పుడు బ్యాంకుల వద్ద జనాల నియంత్రణ వచ్చి పడిందనీ, ఇదొక కొత్త సమస్యగా మారిందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయ‌పడ్డారు. జనం చెప్పినా వినకుండా రద్దీ వాతావరణం సృష్టించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నిబంధనల మేరకు 200 మంది జనాభాకు ఒక పోలీసు ఉండాల్సి ఉండగా 2000 మందికి కూడా ఒకరు లేని పరిస్థితి ఉందన్నారు.

‌సీఎస్‌పీ‌లతో సమస్యకు పరిష్కారం..

ఖాతాల్లో జమైన డబ్బులు తీసుకుని కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ప్రజలకు అందిస్తే బ్యాంకుల వద్ద రద్దీ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, అందుకు సీఎస్‌పీ‌ల ద్వారా కూడా తీసుకోవచ్చని ముందుగా విస్తృత ప్రచారం చేయవలసిన అవసరం ఉందని అంటున్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పోవని ప్రజలకు ఆయా గ్రామాల సర్పంచులు, మహిళా సంఘాల ద్వారా సమాచారం అందిస్తే తప్ప బ్యాంకుల వద్ద రద్దీ తగ్గదని ఓ సీనియర్ పోలీసు అధికారి చెబుతున్నారు.

Tags: banks, customers queue, no social distance, withdraw, money



Next Story

Most Viewed