లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ (14/04/2023)

by Disha Web Desk 16 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ (14/04/2023)
X

దేశంలో తొలిసారిగా నదిలోపలి సొరంగ మార్గంలో మెట్రో:

పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా మెట్రో రైల్వే సంస్థ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా నది లోపల మెట్రో రైలును విజయవంతంగా నడిపింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్‌కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు రైలు పరుగులు తీసింది. ఈ ట్రయల్ రన్‌లో కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ పి. ఉదయ్‌కుమార్ రెడ్డితో పాటు మరికొందరు ఇంజనీర్లు, అధికారులు నదీ గర్భంలో మెట్రో ప్రయాణం చేశారు. ఈ ట్రయల్ రన్ 4.7 కి.మీ ఉంది. ఇది భూ ఉపరితలానికి 33 మీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

విమానయాన భద్రతలో కేటగిరి - 1 హోదాలో భారత్:

విమానయాన భద్రతా ప్రమాణాల్లో భారత్ కేటగిరి - 1 హోదాను పొందింది. అమెరికాకు చెందిన జాతీయ విమానయాన సంస్థ (ఎఫ్ఏఏ) ఈ హోదాను మరోసారి ఇచ్చింది. దీంతో మన దేశం నుంచి విదేశాలకు మరిన్ని విమాన సేవలను విస్తరించడానికి అవకాశం కలగనుంది. కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) జరిపిన ఆడిట్‌లో మన విమానయాన భద్రత భారీగా మెరుగుపడినట్లు తేలిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పేర్కొంది.

ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా:

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను దక్కించుకుంది. పార్టీల హోదాలను మారుస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. మరో వైపు సీపీఐ, తృణమాల్ కాంగ్రెస్, ఎన్సీపీలు జాతీయ పార్టీల హోదాను కోల్పోయాయి. ఈ మేరకు ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సమగ్ర విశ్లేషణ, ఆయా పార్టీలతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.

సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం:

ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, భారతీయ అమెరికన్ అయిన కల్యంపూడి రాధాకృష్ణారావుకు (సీఆర్ రావు) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గానూ ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన బహుమతిని 2023 ఏడాదికి ఆయన అందుకోనున్నారు. 75 ఏళ్ల నాటి రావు కృషి..ఇప్పటికీ సైన్స్ పై ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ తెలిపింది. జులైలో కెనడాలోని అట్టావాలో జరిగే కార్యక్రమంలో సీఆర్ రావు ఈ అవార్డును అందుకుంటారు.

ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి:

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సత్తా చాటారు. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, రచయిత సల్మాన్ రష్టీ, న్యాయనిర్ణేత పద్మాలక్ష్మి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు ఛార్లెస్, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్, ప్రఖ్యాత గాయని బియాన్స్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

భారత టీనేజీ సంచలన రెజ్లర్ అమన్‌కు స్వర్ణం:

ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన ఈ 19 ఏళ్ల హర్యానా కుర్రాడు, ఇప్పుడు సీనియర్ విభాగంలో ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ లోనూ అదరగొట్టాడు. ఈ సారి టోర్నీలో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పసిడి సాధించాడు.

మను బాకర్‌కు స్వర్ణం:

జాతీయ మహిళల 25 మీటర్ల పిష్టల్‌లో మను బాకర్ స్వర్ణం సాధించింది. 25 మీటర్ల పిస్టల్‌లో మను బాకర్ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో మను 31-29తో చింకీ యాదవ్‌ను ఓడించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబుతా విజేతగా నిలిచాడు.

సెబీ కొత్త లోగో ఆవిష్కరణ:

క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నూతన లోగోను సెబీ ఛైర్ పర్సన్ మాధవి పూరి బుచ్ ఆవిష్కరించారు. సెబీ 1988 ఏప్రిల్ 12న ఏర్పాటయింది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.


Next Story