లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 16-2-2023

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 16-2-2023
X

ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి అదానీ:

టాప్ - 20 ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి గౌతమ్ అదానీ వైదొలిగారు. సంస్థకు చెందిన పలు షేర్లు క్షీణించడంతో 23వ స్థానంలోకి అదానీ పడిపోయారు. తాజా ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన సంపద 53.2 బిలియన్ డాలర్లు (రూ.4.40 లక్షల కోట్లు). భారత్ కు చెందిన ముకేశ్ అంబానీ ప్రస్తుతం 83.8 బిలియన్ డాలర్ల (రూ. 6.94 లక్షల కోట్లు) సంపదతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు.

ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. ఈ జాబితాలో 214 బిలియన్ డాలర్ల సంపదతో ఫ్రాన్స్ కు చెందిన ఫ్యాషన్, రియాల్టీ వ్యాపార సంస్థ ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ ప్రథమ స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 192 బిలియన్ డాలర్లు. మూడో స్థానంలో 123 బిలియన్ డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు.

ఫోర్బ్స్ టాప్ 30 యువ సాధకుల జాబితాలో శివతేజ:

డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం కు చెందిన కాకిలేటి శివతేజ ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన టాప్ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐఐటీ గౌహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్ వేర్ కంపెనీని కొంత మంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే ప్రాజెక్టు పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో శివతేజ మెషిన్ లెర్నింగ్ టీమ్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. శివతేజ పరిశోధనలు గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణం:

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (79) అమైలాయిడోసిన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ మరణించారు. భారత్, పాక్‌ల మధ్య 1999 నాటి కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారణం ముషారఫే. కేసుల భయంతో స్వదేశాన్ని వీడి 2016 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లో తలదాచుకున్నారు.

కార్గిల్ యుద్ధం సూత్రదారి ముషారఫే:

1943లో ముషారఫ్ అవిభాజ్య భారత్‌లోని ఢిల్లీకి చెందిన ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.

1947 దేశ విభజన తర్వాత ఆయన కుటుంబంతో పాటు పాక్‌కు వలస వెళ్లారు.

1949 -56 వరకు తండ్రి ఉద్యోగరీత్యా ముషారఫ్ తుర్కియే లో ఉన్నారు.

1961లో పాక్ మిలిటరీ అకాడమీలో చేరారు.

1964లో శతఘ్ని దళంలోకి ప్రవేశించారు.

1965 నాటి భారత్, పాక్ యుద్ధంలో యువ అధికారిగా పాల్గొన్నారు.

1971లో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధంలో కమాండో బెటాలియన్ లో కంపెనీ కమాండర్ గా పోరాడాడు.

1999 ఫిబ్రవరి లో అప్పటి భారత ప్రధాని వాజ్ పేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లాహోర్ లో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు.

కానీ ముషారఫ్ కారణంగా కార్గిల్ యుద్ధం నెలకొంది.

భారత్ పై ఉన్న విపరీతమైన ద్వేషం, సియాచిన్ పై భారత్ కున్న పట్టును సహించలేకపోవడంతో కార్గిల్ చొరబాటు చేయించి యుద్ధానికి కారణమయ్యాడు.

1988-89లో అప్పటి పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో వద్ద ఉంచిన ప్రతిపాదనలను ఆమె అంగీకరించలేదు.

1999లో తన ఆలోచనలను విరమించుకుని ముషారఫ్ మార్చి నుంచి మే మధ్య కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా పాక్ సైన్యాన్ని పంపాడు.

దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తింది.

బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా చుప్పూ:

బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా మహమ్మద్ షహాబుద్దీన్ చుప్పూ(74) ఎన్నికయ్యారు. అవామీ లీగ్ పార్టీ తరఫున చుప్పూ పోటీ చేశారని, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నామని తెలిపింది. చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

ఖేలో ఇండియా క్రీడల్లో రమ్యకు స్వర్ణం:

మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా క్రీడల్లో సపావత్ రమ్య సత్తా చాటింది. జూడో 52 కిలోల విభాగంలో ఆమె స్వర్ణం సాధించింది.

14వ ఏరో ఇండియా ప్రదర్శన:

బెంగళూరులో 14వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రధాని మోడీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజస్, భారత్‌లో తయారీకి, సమర్థతకు ప్రమాణంగా నిలిచినట్లు ప్రధాని ప్రకటించారు. భారత్‌లో తయారీ కారణంగా ప్రస్తుతం 75 దేశాలను రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఈ రంగంలో ప్రంపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉన్నామని మోడీ వెల్లడించారు.

ఏరో ఇండియా ప్రదర్శనకు 98 దేశాల నుంచి 810 రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.


Next Story