Latest Current Affairs: 2022 Awards : కరెంట్ అఫైర్స్: అవార్డులు

by Disha Web Desk 17 |
Latest Current Affairs: 2022 Awards : కరెంట్ అఫైర్స్: అవార్డులు
X

అవార్డులు:

పద్మ విభూషణ్ అవార్డులు:

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మా అవార్డులు వరించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 91 పద్మశ్రీలు ప్రకటించగా ఇందులో తెలుగువారి వాటా పది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 పద్మ పురస్కారాలను ప్రకటించింది. విభిన్న రంగాల్లో సేవలందించిన ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు ఈ జాబితాలో ఎవరిని ఎంపిక చేయలేదు.

నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్:

సినీ ప్రపంచం అత్యున్నత పురస్కారంగా పరిగణించే ఆస్కార్ కల సాకారం దిశగా తెలుగు సినిమా మరో అడుగేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట 95వ ఆస్కార్ నామినేషన్ కు ఎంపికై చరిత్ర సృష్టించింది. విశ్వవేదికపై గోల్డెన్ గ్లోబ్ సహా పలు పురస్కారాల్ని గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించిన ఈ పాట, తాజాగా ఆస్కార్ నామినేషన్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది.

మరొక అడుగు ముందుకు పడిందంటే ఆస్కార్ సొంతమైనట్టే. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో భారతీయ చిత్రం ఆల్ దట్ బ్రెత్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో భారతీయ డాక్యుమెంటరీ లఘుచిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ సైతం నామినేషన్లు దక్కించుకున్నాయి.

ఎలిమెంట్ ఆఫ్ హర్థ్.. అనే పుస్తకాన్ని రాసిన రిషికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం:

చిన్న వయస్సులోనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ అభివృద్ధి చేసి, ఎలిమెంట్ ఆఫ్ హర్థ్ అనే పుస్తకాన్ని రాసిన బెంగళూరు నగరానికి చెందిన బాలుడు రిషి శివ ప్రసన్న (8)కు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం - 2023 దక్కింది.

కేంద్ర మానవ వనరుల శాఖ దేశంలోని అసాధారణ ప్రతిభావంతులైన పలువురు బాలలను గుర్తించింది. వీరికి ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. రిషి సాధనలు అపూర్వమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి ఐక్యూ - 180 ఉన్నట్లు విద్యావేత్తలు తెలిపారు.

ఫెడెక్స్ సీఈఓ రాజేశ్ సుబ్రమణియన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు:

ఫెడెక్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన రాజేశ్ సుబ్రమణియన్‌కు 2023 ఏడాదికి ప్తరిష్టాత్మక హొరాటియో అల్గర్ అవార్డ్ లభించింది. ఉత్తర అమెరికాలో వ్యాపార, పౌర, సాంస్కృతిక రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డునిస్తారు. మొత్తం 13 మందిని ఎంపిక చేశారు. తమ రంగంలోని సమస్యలను సమర్ధంగా ఎదుర్కొని, విజయవంతం కావడంతో పాటు విద్య ఇతరత్రా దాతృత్వ సేవలకు కట్టుబడి ఉండే వారికి ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

Next Story