కరెంట్ అఫైర్స్- 2022: అంతర్జాతీయం

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్- 2022: అంతర్జాతీయం
X

అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్ - 27):

ఈజిప్ట్ లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్ 27) లో భారత్ తన అభిప్రాయాలను వెల్లడించింది.

సమావేశ సందేశంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాలను మేజర్ ఎమిటర్స్, టాప్ ఎమిటర్స్ గా విభజించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఇది అంగీకార యోగ్యం కాదని భారత ప్రతినిధి బృందం సభ్యుడొకరు వెల్లడించారు.

ధనిక దేశాలు తమ చారిత్రక చేటును ఎక్కడా ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయని భారత్ సభ్యుడు వెల్లడించారు.


ఆఫ్గాన్ లో నిజమైన, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి:

ఆఫ్గాన్ లో నిజమైన, సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటుకు మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ ఆన్ ఆఫ్గానిస్తాన్ సమావేశంలో భారత్ తదితర దేశాలు పిలుపునిచ్చాయి.

ఆఫ్గానిస్థాన్ లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశాయి.

రష్యా రాజధాని మాస్కోలో సమావేశానికి ఈ వేదికలో భాగమైన భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాన్, తదితర దేశాల నుంచి ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు.

అమెరికా స్థంబింపజేసిన ఆఫ్గానిస్తాన్ ఆస్తులను పూర్తిగా విడుదల చేయాలనీ అమెరికా, నాటో దళాలు రెండు దశాబ్దాల పాటు ఆఫ్గానిస్థాన్ లో ఉండి అక్కడ జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని సభ్య దేశాలు తీర్మానం చేసినట్లు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.

ప్రపంచ జనాభా 800 కోట్లు: యూఎన్ఎఫ్‌పీఏ

భూమిపై జనాభా 800 కోట్లకు చేరింది.

ఫిలిప్పీన్స్‌లో జన్మించిన శిశవుతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది.

పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్ల నడుమ మానవాళికి ఇదో మైలురాయి.

'మన భూమి ఇప్పుడు 800 కోట్ల ప్రజలకు ఆవాసం' అని ఐక్యరాజ్యసమితికి చెందిన జనాభా నిధి (యూఎన్ఎఫ్‌పీఏ) పేర్కొంది.

అందరూ కలిసి అభివృద్ధికి కృషి చేయాలని కోరింది.


ముఖ్యాంశాలు:

భారత్ లో 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్న జనాభా 68 శాతం

65 ఏళ్లకు పైబడిన వారు 7 శాతం

27 శాతం మంది వయసు 15 నుంచి 29 ఏళ్లు. కౌమార వయస్కులు.

భారత్ లో సంతాన సాఫల్య రేటు తగ్గుతోంది.

వచ్చే ఏడాది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని తెలిపింది.

రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది: ఐక్యరాజ్య సమితి

ఉక్రెయిన్ పై యుద్ధానికి వెళ్లడం ద్వారా అంతర్జాతీయ చట్టాన్ని రష్యా ఉల్లంఘించిందని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ తప్పుపట్టింది.

ఈ మేరకు తీర్మానాన్ని 94 నుంచి 14 ఓట్ల తేడాతో ఆమోదించింది.

73 దేశాలు ఓటింగ్ కు దూరంగా నిలిచాయి.

యుద్ధానికి గానూ రష్యాను జవాబుదారీని చేయాలని ఐరాస పేర్కొంది.

ది ఎక్స్ -37బి ఆరో అంతరిక్ష యాత్ర విజయవంతం:

అమెరికాకు చెందిన ది ఎక్స్ -37 బి ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ తన ఆరో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యోమనౌకను స్పేస్ ఫోర్స్ 2020 మే లో ప్రయోగించగా.. 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలోని కెన్నడి స్పేస్ సెంటర్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది.

గతంలో 780 రోజులు అంతరిక్షంలో ఉన్న రికార్డును ఇప్పుడు అధిగమించి ఏకంగా 908 రోజులు అంతరిక్షంలో ఉంది.


అంతరిక్ష కేంద్రానికి చైనా సరకు రవాణా వ్యోమనౌక:

భూ కక్ష్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి చైనా తాయంఝౌ - 5 అనే సరకు రవాణా వ్యోమనౌకను పంపింది.

లాంగ్ మార్చ్ - 7 వై 6 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం సాగింది.

హైనాన్ ప్రావిన్స్ లోని వెంచాంగ్ అంతరిక్ష కేంద్రం దీనికి వేదికైంది.

తియాంగాంగ్ పేరిట నిర్మిస్తున్న చైనా రోదసి కేంద్రం.. ఈ ఏడాది చివరినాటికి పూర్తి కానుంది.

ఇటీవల మెంగ్జియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్ ను డ్రాగన్ పంపింది.

ప్రస్తుతం ఆ కేంద్రంలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్ తొలగింపు:

కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్‌ను అమెరికా ఆర్థిక శాఖ తొలగించింది. ఈ జాబితాలో ఇటలీ, మెక్సికో, థాయ్ లాండ్, వియత్నాంలకూ మినహాయింపు లభించింది.

అమెరికాతో వాణిజ్యం నిర్వహించే ప్రధాన దేశాలు తమ కరెన్సీ మారకపు విలువ కు సంబంధించి అనుసరించే పద్ధతులు, స్థూల ఆర్థిక విధానాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాలో పేర్లు చేర్చడం, తొలగింపులు చేస్తుంటారు.

గత రెండేళ్లుగా భారత్ ఈ జాబితాలో ఉంది.

ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, కొరియా, జర్మనీ, మలేసియా, సింగపూర్, తైవాన్ మాత్రమే ఉన్నాయి.





Next Story

Most Viewed