ఆధునిక పద్ధతిలో కూరగాయల సాగు

by  |
ఆధునిక పద్ధతిలో కూరగాయల సాగు
X

దిశ, నిజామాబాద్ రూరల్: కాలానికనుగుణంగా సాగు పద్ధతుల్లో రైతులు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. తద్వారా అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చాలా మంది అన్నదాతలు కూరగాయల నారు పెంపకంపై దృష్టి సారించారు. రూరల్ నియోజకవర్గ పరిధి ఇందల్వాయి మండల కేంద్రం 44 వ జాతీయ రహదారి పక్కన మాషా అల్లా వెజిటేబుల్ నర్సరీ లో టమాట, మిరప, వంకాయ, కాలీఫ్లవర్ తోపాటు బంతి, చామంతి మొక్కల నారు పెంచుతున్నాడు నిర్వాహకుడు బాషాబాయ్. ఒక్కో మొక్క రూ. రెండు నుంచి ఐదు వరకు విక్రయిస్తూ అన్నదాతలకు ఎంతో మేలు చేకూరుస్తున్నారు.

అర ఎకరంలో..

తమకున్న అర ఎకరం విస్తీర్ణంలో షేడ్​నెట్లను ఏర్పాటు చేసుకొని వివిధ రకాల కూరగాయల నారును పెంచుతూ జిల్లా రైతుల అవసరాలు తీరుస్తున్నాడు బాషాబాయ్. అనుకూలమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అందులో కూరగాయల మొక్కలను పెంచుతున్నాడు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఇందల్వాయి నర్సరీకి వచ్చి మొక్కల నారును కొనుగోలు చేస్తారని స్థానిక రైతులు చెబుతున్నారు.

నారుతో సాగు ఈజీ

కూరగాయలు సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును సిద్ధం చేసుకోవాలి. గతంలో తమ పొలాల వద్ద నారుమడులను అన్నదాతలు సిద్ధం చేసుకునేవారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ఎండకు ఎండి, వానకు తడిసి సరిగ్గా ఎదగకపోయేవి. అయితే అలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా వెజిటేబుల్ నర్సరీలో అందుబాటులో ఉన్న, తమకు నచ్చిన కూరగాయల నారు పెంచుతున్నారు. దీంతో జిల్లా రైతులు ఆ నారును తీసుకెళ్లి వారి వారి వ్యవసాయ క్షేత్రాల్లో నాటుకుంటారు. కూరగాయాలను సమీప గ్రామాలు, పట్టణాల్లో విక్రయిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.

Next Story