కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు : సీఎస్

by  |
కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు : సీఎస్
X

దిశ, జగిత్యాల ; కరోనా వ్యాధి నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, కరోనావ్యాప్తి నివారణ చర్యలపై బుధవారం కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను పకడ్భందీగా చేపట్టాలన్నారు.కరోనా పరీక్షలు పెంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం రోజు వంద పరీక్షలను, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 150 పరీక్షలను, సివిల్ ఆస్పత్రిలో 3 వందల టెస్టులను నిర్వహించాలని తెలిపారు. వాటి ఫలితాలను కోవిడ్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా కోవిడ్ వ్యాప్తిస్తున్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని, ఇళ్లలో వసతి లేనివారిని ప్రభుత్వ క్వారంటైన్ హోంలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. కరోనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని, జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వరాదన్నారు. ప్రజలు తప్పనిసరిగ్గా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కొవిడ్ పేషేంట్ల కోసం ప్రత్యేకంగా బెడ్లు, వార్డులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు 14వందల మందికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని, వైరస్ వ్యాప్తిని బట్టి అదనంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోవిడ్ పేషేంట్ల కోసం ప్రస్తుతం వంద బెడ్లతో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, వాటిలో 50 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని, 15 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లాలో మంగళవారం 175 నూతన కేసులు వచ్చాయని అన్నారు., వీరందరని హోం క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేల 6 వందల 37 మందికి కరోనా వైరస్ నిర్థారించగా, 10 వేల 8 వందల 97మంది కోలుకున్నారని, 56 మంది మరణించారని, 684 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో 675 మంది, ఆసుపత్రిలో 9 మందికి వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Next Story

Most Viewed