'అంతేకాదు.. క్రిమినల్ కేసులు కూడా… '

by  |
అంతేకాదు.. క్రిమినల్ కేసులు కూడా…
X

దిశ, వరంగల్: కర్ఫ్యూ సమయంలో ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్-19 నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాయంత్రం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ కర్ఫ్యూ సమయంలో మెడికల్ షాపులు, ఆస్పత్రులకు మినహాయించి ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి ఎవరైనా అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అంతేకాకుండా వారి వాహనాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా కర్ఫ్యూ సమయానికి ముందే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వస్తువులకు సంబంధించిన షాపు యజమానులు సాయంత్రం ఆరుగంటలలోపే షాపులను మూసివేసి తిరిగి ఇండ్లకు చేరుకోవాల్సి వుంటుందన్నారు.

అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కూడా తమ కార్యకలాపాలను పూర్తి చేసుకుని సాయంత్రం 7 గంటలలోపే ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. అత్యవసర విభాగాలకు సంబంధించిన ప్రభుత్వోగులకు మినహాయింపు ఉంటుందని, కర్ఫ్యూ సమయాల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరోనా నివారణను ప్రతి పౌరుడు తన వ్యక్తిగత బాధ్యతగా భావించి ప్రభుత్వం సూచనలను పాటించాలని‌ ఆయన కోరారు.



Next Story

Most Viewed