ఇంట్లో ఏకాంతంగా ఉండటం లేదని మహిళా పోలీసును చంపిన భర్త

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-23 10:30:23  IST  )

ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు.

ఇంట్లో ఏకాంతంగా ఉండటం లేదని మహిళా పోలీసును చంపిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. ఉద్యోగ బాధ్యతల్లో మునిగి తనతో ఎక్కువ టైం ఏకాంతంగా గడపడం లేదని భార్యను హత్య చేశాడో భర్త. బిహార్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాట్నా సమీపంలోని జెహనాబాద్‌కు చెందిన గజేంద్రయాదవ్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయనకు శోభాకుమారి (23) అనే యువతితో ఆరేళ్ల క్రితం పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప జన్మించింది.

కాగా, ఇటీవల శోభాకుమారికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా ఆమె ఎక్కువ సమయం బిజీగానే ఉండేది. దీంతో ఇంట్లో ఎక్కువ సమయం గడపలేక పోయింది. ఇదే విషయంపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదని, కుటుంబానికి టైం కేటాయించడం లేదని తరచూ ఆమెతో భర్త వాదనకు దిగేవాడు. ఈ క్రమంలోనే శోభాకుమారిని ఓ హోటల్ గదికి పిలిచి తనతో ఏకాంతంగా గడపడానికి టైం ఇవ్వాలని కోరాడు. దీంతో భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక కోపాన్ని ఆపుకోలేక పోయిన గజేంద్రయాదవ్ తుపాకీతో భార్యను కాల్చి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story