ఏసీబీకి పక్కా ఆధారాలతో దొరికిన డీటీసీ శ్రీనివాస్.. ఎన్ని రూ.కోట్ల ఆస్తులు బయటపడ్డాయంటే..

by Bhoopathi Nagaiah |

ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ) డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌పై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)పై కేసు న‌మోదు చేసింది.

ఏసీబీకి పక్కా ఆధారాలతో దొరికిన డీటీసీ శ్రీనివాస్.. ఎన్ని రూ.కోట్ల ఆస్తులు బయటపడ్డాయంటే..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ) డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌పై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)పై కేసు న‌మోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లుగా గుర్తించిన అధికారులు ఈమేర‌కు కేసు న‌మోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హ‌న్మకొండ ప‌లివేల్పుల‌లోని శ్రీనివాస్‌ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు శుక్రవారం ఉద‌యం 6గంట‌ల నుంచి అర్ధరాత్రి వ‌ర‌కు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో హనుమకొండలోని ఆయ‌న నివాసంతో పాటు భీమారంలోని ఆర్‌టీఏ కార్యాలయం, హైదరాబాద్‌లోని సొంతిల్లు, స్వస్థలం జగిత్యాలతోపాటు కరీంనగర్‌లోని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్‌లోని విల్లాలతోపాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో దాదాపు రూ.5ల‌క్షల విలువ చేసే ఫారిన్ లిక్కర్‌ను కూడా గుర్తించిన‌ట్లుగా వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు.

అక్రమ ఆస్తులు క‌లిగి ఉన్నట్లుగా ప్రాథ‌మిక నిర్ధార‌ణ త‌ర్వాత శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. సుమారు 10 గంటలపాటు ఆయనను విచారించారు. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించిన తర్వాత హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం తిరిగి ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఈమేర‌కు శ‌నివారం వ‌రంగ‌ల్ ఏసీబీ కోర్టులో శ్రీనివాస్‌ను రిమాండ్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌ను ఇంకా లోతుగా ప‌రిశీలిస్తున్నట్లు తెలిపారు. విచార‌ణ వివ‌రాల‌ను స్వయంగా ఏసీబీ డీజీపీ వెల్లడించ‌నున్నట్లు కూడా ప్రక‌ట‌న‌లో స్పష్టం చేశారు.

భారీగా ఆస్తుల గుర్తింపు..

గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరిం చిన డా.పుప్పాల శ్రీనివాస్ అంతకుముందు ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పని చేశారు. ఈ క్రమంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందగా.. ఈ మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం డీటీసీ అక్రమాస్తుల విలువ సుమారు రూ.4.5 కోట్ల వరకు ఉండగా.. బయట మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాటి విలువ రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఇందులో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాలకుపైగా వ్యవసాయ భూమితో పాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వాటితో పాటు 23 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. దీంతో శనివారం కూడా డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌పై విచారణ కొన‌సాగిస్తున్నారు.

వ‌రంగ‌ల్ డీటీవో ల‌క్ష్మిపై వేటు..!

వరంగల్ రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. డీటీసీ పుప్పాల‌ శ్రీనివాస్ ఇళ్ళల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత వ‌రంగ‌ల్ డీటీవోగా ప‌నిచేస్తున్న ల‌క్ష్మిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. హైదరాబాద్ లోని కమిషనర్ కార్యాలయంలో ఆమెను రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో గతంలోనే డీటీఓ లక్ష్మికి వ‌రంగ‌ల్ క‌లెక్టర్ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. తాజాగా ఆమెను డీటీవోగా త‌ప్పిస్తూ ఉత్తర్వులు జారీ కావ‌డం గ‌మ‌నార్హం. వ‌రంగ‌ల్ ఇన్చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అద‌న‌పు బాధ్యత‌లు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story