ర్యాగింగ్‌ భరించలేక రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య

by Disha Web Desk 2 |
ర్యాగింగ్‌ భరించలేక రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ర్యాగింగ్‌కు భయపడి ఓ విద్యార్థి రైలుకింద పడి బలవన్మరణం చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ టి.పెంచలయ్య, లక్ష్మికుమారి దంపతుల కుమారుడు ప్రదీప్‌. కావలిలోని RSR ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రదీప్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్‌లో ఎలాగోలా నెట్టుకొచ్చినా, సెకండ్ ఇయర్‌లోనూ అతడ్ని ర్యాగింగ్ భూతం వెంటాడింది. అమ్మాయిల ఫోన్ నెంబర్లు కావాలంటూ ప్రదీప్‌ను సీరియర్లు ర్యాగింగ్ చేసేవారట.

క్లాస్ మేట్స్ అమ్మాయిల ఫోన్ నెంబర్లు కావాలని, బీర్లు, బిర్యానీ కొనిపెట్టాలంటూ ఒత్తిడి చేసేవారని సమాచారం. ఆటో డ్రైవర్ కొడుకు కావడం, మధ్యతరగతి కుటుంబం కావడంతో డబ్బులు ఇవ్వలేక, వారు పెట్టే టార్చర్ భరించలేక చాలాసార్లు ప్రదీప్ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడని అంటున్నారు. డబ్బులు లేవని చెబితే సెల్ ఫోన్ లాక్కొని చుక్కులు చూపించేవారని సమాచారం. అంతేగాక, హాస్టల్ వదిలి వెళ్లిపోతే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శివరాత్రికి సెలవలు రావడంతో ప్రదీప్, కావలి కలుగోళమ్మపేటలో ఉన్న చిన్నమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా, బోగోలు మండలం కడనూతలలోని RSR ఇంజినీరింగ్‌ కాలేజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుండటం గమనార్హం.


Next Story

Most Viewed