గుంతకల్లులో ఇద్దరి దారుణ హత్య

by Dishafeatures2 |
గుంతకల్లులో ఇద్దరి దారుణ హత్య
X

దిశ, అనంతపురం: గుంతకల్లు పట్టణంలో సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో ఒక ల్యాండ్ లార్డ్ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గుంతకల్లు DSP యు.నర్సింగప్ప తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉండే ల్యాండ్ లార్డ్ జీపీ కోటిరెడ్డి (60), ఆయన డ్రైవర్ షేక్షావలి (33)లను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారన్నారు. మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సోఫాలో కూర్చున్న జీపీ కోటిరెడ్డి గొంతును పదునైన చాకుతో కోసి పరార్ అవుతుండగా అక్కడే ఉన్న ఆయన కారు డ్రైవర్ షేక్షావలి దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు గుర్తించామన్నారు. దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తులు షేక్షావలి కుడివైపు పొట్టలోకి కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. దీంతో అక్కడికక్కడే షేక్షావలి కూడా మృతి చెందాడన్నారు.

కోటిరెడ్డి ఇంట్లో పని చేస్తున్న వహీదను పోలీసులు విచారించగా కొందరు వ్యక్తులు ఇంటిలోకి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టమని కోటిరెడ్డి పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు తెలిపినట్లు సమాచారం. వారు తీసుకుని వచ్చిన డాక్యుమెంట్స్ పై ఆయన సంతకాలు చేయకపోవడం తో దుండగులు కోటిరెడ్డిని గొంతు కోసి చంపినట్లుగా పోలీసులకు తెలిపినట్లు సమాచారం. గతంలో నుండి కోటిరెడ్డికి సంబంధించిన ఆస్తి తగాదాలు దీనికి కారణమైనట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, ఒకటవ పట్టణ సీఐ రామసుబ్బయ్య, టు టౌన్ సీఐ గణేష్ అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు.

జీపీ కోటి రెడ్డి హత్య వార్త విన్న గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందరితో మంచిగా మెలిగే కోటిరెడ్డిపై ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భార్య పిల్లలు విదేశాల్లో ఉన్నట్లుగా సమాచారం. ఆయన కూడా 15 రోజుల క్రితం గుంతకల్లుకు వచ్చినట్లుగా తెలిసింది. ఆయనకు ఆయన బంధువులకు మధ్య నెలకొని ఉన్న ఆస్తి గొడవలు, వారి మధ్య నెలకొని ఉన్న విభేదాల కారణంగానే హత్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.



Next Story

Most Viewed