వ్యవసాయ క్షేత్రంలో రెండు మృతదేహాలు లభ్యం..

by Disha Web Desk 20 |
వ్యవసాయ క్షేత్రంలో రెండు మృతదేహాలు లభ్యం..
X

దిశ, గుడిహత్నూర్ : మండలంలోని సీతాగొంది పంచాయితీ పరిధిలోని గర్కంపేట్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పడి ఉన్న రెండు మృతదేహాలు ఆదివారం మండలంలో కలకలం రేపాయి. వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకి వెళ్లే వారికి రెండు మృతదేహాలు కనిపించడంతో వారు వేంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని ఉన్నత పోలీస్ అధికారులకు తెలియజేయడంతో అక్కడికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, ఇచ్చోడా సీఐ ముదావత్ నైలు, పలువురు ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు మృతదేహాలను పరిశీలించగా మృతుల తలలను తీవ్రంగా గాయపరిచి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటన స్థలానికి సమీపంలోని బీటి రోడ్డుపై నిలిచి ఉన్న స్కూటీని పరిశీలించిన పోలీసులు దాని నెంబర్ ఆధారంగా వాకబు చేయగా ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన మహమ్మద్ రహెమాన్ (20), సుందరయ్య నగర్ కి చెందిన సోన్ కాంబ్లే అశ్విని(28) మృతదేహాలుగా గుర్తించారు. మృతురాలు అశ్విని వివాహిత కాగా మృతుడు రహెమాన్ అవివాహితుడు. ఈ హత్యలకు ఇరువురి మధ్య అక్రమ సంబంధం కారణమై ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టి జంట హత్యలకు కారకులైన వారిని త్వరలోనే పట్టుకొని ఈ మిస్టరీని ఛేదిస్తామని డీఎస్పీ నాగేందర్ అన్నారు.

Next Story

Most Viewed