నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్.. మలేషియా లింకులు బయటపెట్టిన సిట్

by Kema Shiva Kumar |

నాసిక్ టీసీఎస్ (TCS) మతమార్పిడి కేసులో మరికొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్.. మలేషియా లింకులు బయటపెట్టిన సిట్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని నాసిక్‌ (Nashik) టీసీఎస్ (TCS) కార్యాలయంలో జరిగిన మతమార్పిడి యత్నాల కేసు విచారణలో తవ్వేకొద్దీ సంచనాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌ (Nida Khan)కు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, పోలీసులు ఈ కుట్ర వెనుక ఉన్న అంతర్జాతీయ సంబంధాలను కోర్టుకు వివరించారు. నిదా ఖాన్ తన కొలీగ్‌ను ఇస్లాం మతంలోకి మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోర్టుకు తెలిపింది. బాధితురాలికి బుర్కా ధరించడం, నమాజ్ చేయడం వంటి పద్ధతులను నేర్పడమే కాకుండా, ఆమె ఫోన్‌లో మతపరమైన లెర్నింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

హానియాగా పేరు మార్పు..

బాధితురాలి అసలు పేరును మార్చి ‘హానియా’గా పెట్టేందుకు నిందితులు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి నిందితురాలి ఫోన్‌లో పలు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) రీల్స్, యూట్యూబ్ లింకులను పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం కేవలం నాసిక్‌కే పరిమితం కాలేదని, ఈ మొత్తం వ్యవహారానికి మాలేగావ్ (Malegaon), మలేషియా (Malaysia)తో సంబంధాలు ఉన్నాయని సిట్ కోర్టుకు వెల్లడించింది. బాధితురాలిని మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో అక్కడికి తరలించేందుకు ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి నిందితులు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అదేవిధంగా మరో నిందితుడు డానిష్ షేక్.. బాధితురాలి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్లు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను తన ఆధీనంలోకి తీసుకున్నాడని, వాటిని మాలేగావ్‌లోని ఓ బృందానికి అందజేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇంకా పరారీలోనే నిందితురాలు నిదా ఖాన్

ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయం బయటపడుతుందని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు నిదా ఖాన్‌కు ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. అయితే, నిదా ఖాన్ తరపు న్యాయవాది మాత్రం సిట్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. మహారాష్ట్ర (Maharashtra)లో మతమార్పిడికి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం లేదని, కేవలం మతపరమైన భావాలను దెబ్బతీశారనే ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని వాదించారు. ఈ కేసులో పలువురు బాధితుల పేరుతో 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలువ విన్న కోర్టు తదుపరి విచారణను మే 2కు వాయిదా వేసింది.

Next Story