BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

by Naga Rani Yarlagadda |

గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లాలో ఆబూ–పాలన్పూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లాలో ఆబూ–పాలన్పూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్బాల్ గఢ్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్, ఎస్‌యూవీ (ఇన్నోవా) కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు సగభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు వెళ్తున్న ట్రక్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. డివైడర్‌ను దాటి రోడ్డుకు అవతల వైపుకు దూసుకెళ్లిన ట్రక్, ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఢీకొంది. ఢీకొన్న తర్వాత ట్రక్ కారును కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి, చివరికి రహదారిపైనే పల్టీ కొట్టింది.

ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది రాజస్థాన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఒక పెషెంట్ ను తీసుకుని వారంతా పాలన్పూర్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ట్రక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అమీర్‌గఢ్ పోలీసులు, స్థానిక పరిపాలనా అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలు, గాయపడిన వారిని బయటకు తీసేందుకు భారీ యంత్రాలను ఉపయోగించారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story