మోమిన్‌పేటలో విషాదం.. ప్రహరీ గోడ కూలి 7 ఏళ్ల బాలుడు మృతి

by Taduka Kalyani |

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల కేంద్రంలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

మోమిన్‌పేటలో విషాదం.. ప్రహరీ గోడ కూలి 7 ఏళ్ల బాలుడు మృతి
X

దిశ,మోమిన్‌పేట్ : వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల కేంద్రంలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మోమిన్‌పేట్కు చెందిన నాగేష్–భాగ్యమ్మ దంపతుల కుమారుడు, మూడో తరగతి విద్యార్థి అరిగే దుర్గాప్రసాద్ (7) గిరిధర్ వెంచర్‌లో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా అక్కడి ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన కుమారుడి మృతికి అప్నాబజార్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బాలుడి తల్లి భాగ్యమ్మ ఆరోపించారు. వెంచర్ ప్రహరీ గోడకు ఆనుకుని ఇసుకను భారీగా డంపింగ్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి గోడ కూలిందని ఆమె మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, సీఐ వెంకట్, ఎస్సై భరత్ భూషణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గోడ కూలడానికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ విషాద ఘటన మోమిన్‌పేట్ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story