ఊపిరాడనివ్వని ‘ఆపరేషన్ కగార్’.. మరో 47 మంది మావోయిస్టులు సరెండర్!

by Kema Shiva Kumar |

తెలంగాణ పోలీసుల ఎదుట మరో 47 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఊపిరాడనివ్వని ‘ఆపరేషన్ కగార్’.. మరో 47 మంది మావోయిస్టులు సరెండర్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మావోయిస్టుల పార్టీ దాదాపు కనుమరుగయ్యేలా ఉంది. ఓవైపు రాష్ట్ర పోలీసుల నిరంతర నిఘా, కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్‌’ (Operation Kagar) వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఏకంగా 47 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోబోతున్నారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న 34 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించనున్నారు. అనంతరం డీజీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు శివధర్ రెడ్డి వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టుల నేపథ్యం, వారి హోదాలు, లొంగుబాటు వెనుక ఉన్న బలమైన కారణాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు..

లొంగిపోబోన్న మావోయిస్టులంతా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. అక్కడ భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం, తెలంగాణలో లొంగిపోయిన వారికి అందుతున్న పునరావాస ప్యాకేజీల పట్ల నమ్మకం కలగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వందలాది మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ముఖ్యంగా ఫిబ్రవరిలో మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న సైతం లొంగిపోవడంతో ఉద్యమం తీవ్రంగా బలహీనపడింది. తాజాగా మరో 47 మంది మావోయిస్టుల సరెండర్‌తో మావోయిస్టుల సంఖ్య దేశవ్యాప్తంగా భారీగా తగ్గుముఖం పట్టిందని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి.

Next Story