Karthika Deepam : 'కార్తీక దీపం' సీరియల్ చూస్తూ వ్యాపారి అనూహ్య ప్రవర్తన..

by Disha Web Desk 6 |
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ చూస్తూ వ్యాపారి అనూహ్య ప్రవర్తన..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : 'కార్తీకదీపం' సీరియల్ ముగింపు ఎపిసోడ్ ఉత్కంఠంగా సాగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. టీవి సీరియల్ చూడనీయకుండా కష్టమర్ విసిగిస్తున్నాడంటూ తన దుకాణానికి వచ్చిన వ్యక్తి వేలిని వ్యాపారి కొరికి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం (రామప్ప) పోలీస్ స్టేషన్ పరిధిలో పాలంపేట గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎస్సై తాజొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిలి కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. అందులోనే మద్యాన్ని కూడా విక్రయిస్తున్నాడు.

అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేశాడు. తాగిన అనంతరం మరికొంత మద్యం కావాలని అడిగాడు. డబ్బులు ఇవ్వాలని షాపు యజమాని మొగిలి అడగగా, తన వద్ద డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని వెంకటయ్య చెప్పాడు. అయినప్పటికీ వెంకటయ్య వినకపోవడంతో మొగిలి ఆగ్రహంతో అతడి కుడిచేతి చూపుడు వేలిని కొరికాడు. ఈ విషయమై మరుసటి రోజు తాళ్లపెల్లి వెంకటయ్య పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది దుకాణ యజమాని మొగిలిని విచారించగా తాను ఆసమయంలో కార్తీకదీపం సీరియల్ చూస్తున్నానని, డబ్బులు ఇవ్వకపోవడమేకాకుండా పదేపదే విసిగించడంతో తాను విసుగుచెంది ఆలా ప్రవర్తించాల్సి వచ్చిందని వ్యాపారి తెలిపారు. భాదితుడు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగిలిపై ఐపీసీ 290, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed