Telangana Police: ఆ మెసేజ్ వచ్చిందంటే కచ్చితంగా మోసమే.. అలర్ట్‌గా ఉండండి!

by Gantepaka Srikanth |

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ మోసాలు(Cyber Crimes) కూడా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.

Telangana Police: ఆ మెసేజ్ వచ్చిందంటే కచ్చితంగా మోసమే.. అలర్ట్‌గా ఉండండి!
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ మోసాలు(Cyber Crimes) కూడా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని.. ఆఫర్లంటూ ఫోన్లకు ఫేక్ లింకులు పంపిస్తున్నారు. ఆశగా క్లిక్ చేసేసరికి అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఈ తరహా ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు(Telangana Police) హెచ్చరికలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘సోషల్‌ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలతో జాగ్రత్త. డిస్కౌంట్లు, ఆఫర్లు అంటూ లింక్స్ వచ్చే లింక్స్‌ క్లిక్ చేసేముందు ఆలోచించండి. మీ బలహీనతను ఆసరాగా చేసుకొని జరుగుతున్న మోసమిది. అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.

అంతేకాదు.. పార్ట్‌టైం జాబ్స్ పేరిట జరుతున్న మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇంట్లో ఉంటూనే ఫోన్‌ ద్వారా వర్క్ చేసి వేలు సంపాదించవచ్చు అని వచ్చే ప్రకటనలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని పేర్కొన్నారు. చిన్న పెట్టుబడితో భారీగా లాభాలు అంటే ఖచ్చితంగా మోసమే. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో కనిపించే పార్ట్‌టైమ్ జాబ్‌ ప్రకటనలు నమ్మకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కాగా, ఇటీవలే సైబర్ మోసగాళ్లు ఓ బీటెక్ విద్యార్థికి టోకరా ఇచ్చి ఏకంగా రూ.7,83,500 కొల్లగొట్టారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామానికి చెందిన యువకుడు బీటెక్ చదువుతున్నాడు. గత నెల 16న ఓ నంబరు నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని నమ్మించి మొదట రూ.1,000 ఫోన్ పే ద్వారా పంపించుకున్నారు. అలాగే మొత్తం రూ. 7,83,500 వారి చెప్పిన ఖాతాకు చెల్లిస్తూ పోయాడు. చివరకు డబ్బులు తిరిగి రాకపోయేసరికి మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఎవరూ మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story