కాలనీల్లో వీధి కుక్కల స్వైరవిహారం.. జంకుతున్న జనం...

by Disha Web Desk 11 |
కాలనీల్లో వీధి కుక్కల స్వైరవిహారం.. జంకుతున్న జనం...
X

దిశ, కాప్రా: వీధి కుక్కల సమస్య రోజురోజుకీ జఠిలమవుతోంది. కాలనీలో ఎటుచూసినా గుంపులు గుంపులుగా వీధి కుక్కలు సంచరిస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం కుక్కల సమస్యను నివారించడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కాప్రా సర్కిల్ కుషాయిగూడ వాసవి శివ నగర్ లో ఓ మహిళ మహిళతో పాటు మరో వ్యక్తిని వీధి కుక్కలు గాయపర్చాయి.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన అంజమ్మ శివ సాయినగర్ లోని తన కూతురు ఇంటికి వచ్చింది. గురువారం ఇంటి ముందు కూర్చుని ఉండగా వీధి కుక్క దాడి చేసింది. కుడి కాలుపై రెండు చోట్ల తీవ్రంగా కరిచింది. రక్తస్రావం జరిగిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఇదే కాలనీలో మైసమ్మ గుడి దగ్గర ట్యూషన్ వద్దకు తన కుమారుడిని తీసుకొని వచ్చిన దమ్మాయిగూడకు చెందిన వ్యక్తిపై మరో కుక్క దాడి చేసి గాయపరిచింది.

సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ, కాప్రా, చర్లపల్లి, చక్రిపురం, నాగార్జునానగర్ కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీల్లో గుంపులు గుంపులుగా వీధికుక్కలు సంచరిస్తుండటంతో కాలనీవాసులు జంకుతున్నారు. కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయోననే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, వన్యప్రాణి విభాగం అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ణప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed