నగరంలో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం.. సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-20 04:46:33  IST  )

ఉద్యోగంలోంచి తొలగించారని తోటి ఉద్యోగిపై మరో ఉద్యోగి బ్లేడుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది.

నగరంలో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం.. సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని అత్తాపూర్ (Attapur) పరిధి సులేమాన్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఫర్నీచర్ షాపులో పనిచేస్తున్న రెహానా అనే వ్యక్తిపై తోటి ఉద్యోగి పగతో ఊగిపోయి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ భయంకర దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నిందితుడు గతంలో అదే ఫర్నీచర్ షాపులో పనిచేసేవాడు. అయితే, అతడిని ఉద్యోగంలోంచి తొలగించి, ఆ స్థానంలో రెహానాను నియమించడంతో అతడు తీవ్ర కక్ష పెంచుకున్నాడు. తన ఉద్యోగం పోవడానికి ఆ యువకుడే కారణమని భావించి అతడిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు.

నిద్రిస్తుండగా ఘాతుకం..

ఈ క్రమంలోనే రెహానా తన పని ప్రదేశంలో నిద్రిస్తున్న సమయంలో నిందితుడు అతడి దగ్గరకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఒక్కసారిగా దాడి చేశాడు. మెడపై, శరీర భాగాలపై విచక్షణారహితంగా కోశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన రెహానా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన రెహానాను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి అత్యవసర చికిత్స అందుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story