ప్రియుడితో క‌లిసి భ‌ర్త మ‌ర్డ‌ర్ కి స్కెచ్

by Ratna Kumari |   (  Updated:2026-05-16 09:26:18  IST  )

వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా వ‌స్తున్నాడ‌నే ఉద్దేశంతో ప్రియుడితో భ‌ర్త‌ను హ‌త్య చేయించిన‌ ఘ‌ట‌న ప‌టాన్ చెరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ప్రియుడితో క‌లిసి భ‌ర్త మ‌ర్డ‌ర్ కి స్కెచ్
X

దిశ‌, శేరిలింగంప‌ల్లి : వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా వ‌స్తున్నాడ‌నే ఉద్దేశంతో ప్రియుడితో భ‌ర్త‌ను హ‌త్య చేయించిన‌ ఘ‌ట‌న ప‌టాన్ చెరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. శేరిలింగంప‌ల్లి జోన్ డీసీపీ సీ.హెచ్. శ్రీనివాస్ గ‌చ్చిబౌలి డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన శేఖ‌ర్ ప‌టాన్ చెరు ప‌రిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో కుటుంబంతో క‌లిసి నివాసం ఉండేవాడు. ఇత‌ను ఆటో డ్రైవ‌ర్ గా ప‌ని చేసేవాడు. ప‌టాన్ చెరు లో హోట‌ల్ న‌డుపుతున్న న‌వీన్ తో శేఖ‌ర్ కి నాలుగు సంవ‌త్స‌రాలుగా ప‌రిచ‌యం ఉంది. ఈ క్ర‌మంలో న‌వీన్ అప్పుడ‌ప్పుడు శేఖ‌ర్ ఇంటికి వ‌స్తూ పోతూ ఉండేవాడు. అదే క్ర‌మంలో అత‌ని భార్య ప్ర‌మీల‌తో ప‌రిచ‌యం పెంచుకున్నాడు.

ఆ ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ప్ర‌స్తుతం ప్ర‌మీల 7 నెల‌ల గ‌ర్భ‌వ‌తి. ఇటీవ‌లే శేఖ‌ర్ కి వీరి వివాహేత‌ర సంబంధం గురించి తెలియ‌డంతో భార్య‌భ‌ర్తల మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. శేఖ‌ర్ త‌న భార్య‌ను వేధించ‌డంతో పాటు న‌వీన్ ను కూడా హెచ్చ‌రించాడు. త‌మ వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా వ‌స్తున్నాడ‌ని.. అత‌న్ని వ‌దిలించుకోవాల‌ని ప్ర‌మీల‌, న‌వీన్ స్కెచ్ వేశారు. ఈనెల 12న శేఖ‌ర్ ను ప‌టాన్ చెరు క్యాండిడ‌స్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న ఓ బ‌హిరంగ ప్ర‌దేశంలో మ‌ద్యం సేవించ‌డానికి పిలిచాడు న‌వీన్. ఇద్ద‌రు క‌లిసి మ‌ద్యం సేవించిన త‌రువాత న‌వీన్ అత‌ని త‌ల‌పై బండరాయితో బ‌లంగా బాది హ‌త్య చేశాడు. అనంత‌రం ఈ విష‌యాన్ని ప్ర‌మీల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం అందించాడు. ప‌టాన్ చెరు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. నిందితులు న‌వీన్, ప్ర‌మీల‌ను అరెస్ట్ చేశారు.

Next Story