భూకబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవోను హత్య చేశారు..బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

by Dishafeatures2 |
భూకబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవోను హత్య చేశారు..బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతల భూకబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్యను హత్య చేశారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇటీవల కిరాయి హంతకులు చేతిలో దారున హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కుటుంబాన్ని బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పక్షాన పోరాడుతున్న రామకృష్ణయ్యను బీఆర్ఎస్ నాయకులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో కుక్క పిల్లలకు కూడా రక్షణ కల్పించే పోలీసులకు, రామక్రిష్ణయ్య ప్రాణాలను కాపాడలేకపోవడం చూస్తే అంతా పక్కా ప్లానుతో జరిగిన కుట్రగా కనిపిస్తోందని అన్నారు.

ఈ హత్య వెనుక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హస్తం ఉందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారని, బీఆర్ఎస్ నేతల ఆగడాలను ప్రశ్నిస్తూ,పేదల పక్షాన పోరాడుతున్నందుకే ఈ హత్య జరిగిందని తాను భావిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అండతో సీరియల్ హత్యలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ జరిపి ఉరి శిక్ష పడేదాక వదలబోమని హెచ్చరించారు.



Next Story

Most Viewed