ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి

by Disha Web Desk 12 |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి
X

దిశ, హనుమకొండ టౌన్ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శివరాం (24) రైల్వే ట్రైనీ టికెట్ కలెక్టర్, హరికృష్ణ (23) సాప్ట్ వేర్. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. మృత్యువుకు వీడని అన్నదమ్ముల బంధాన్ని చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్ కందుగులలో హోటల్ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను కష్టపడి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశారు.

శివరాం (24) ఇటీవలే రైల్వేలో టికెట్ కలెక్టర్ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ (23) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్టు‌వేర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న ఆ తల్లి దండ్రుల ఆశలు సోమవారం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో అడియాశలుగానే మిగిలాయి. సోమవారం శివరాం, హరికృష్ణలు హైదరాబాద్‌లో కొలువులో చేరడానికి కందుగుల నుంచి తెల్లవారుజామున 5 గంటలకు తమ ద్విచక్రవాహనం పై హైదరాబాద్ బయలుదేరారు.

మార్గమధ్యలో అనంతసాగర్ క్రాసు రోడ్డు వద్ద ఉదయం 5:39 గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసుల సంఘటనా స్థలానికు చేరుకుని మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుల తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed