ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి పరిస్థితి విషమం..

by Disha Web Desk 20 |
ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి పరిస్థితి విషమం..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : కందనూలులో రోడ్డుప్రమాదం సంభవించింది. ఇసుక ట్రాక్టర్ బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి పరిస్థితి విషమంగా మారిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా మంతటి చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన దుడ్డు చంద్రయ్య బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో బీరప్ప పండుగ నిమిత్తం హాజరయ్యారు. సాయంత్రం సొంత గ్రామానికి ద్విచక్రవాహనం పై తిరుగు పయనం అయ్యారు. క్రమంలో తెలకపల్లి నుండి అత్యంత వేగంతో ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న చంద్రయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే 108 సాయంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు వైద్యులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు నాగర్ కర్నూల్ జిల్లాలో తరచూ జరుగుతున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో అధికారులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కనీసం ఎలాంటి ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లు ఇసుక ట్రాక్టర్లను డ్రైవింగ్ చేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో పాలుపోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story