ఆర్జీకర్ వైద్యురాలి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. మృతదేహంపై మరో మహిళ డీఎన్ఏ

by Yella Dhawani Reddy |

కలకత్తా ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆర్జీకర్ వైద్యురాలి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. మృతదేహంపై మరో మహిళ డీఎన్ఏ
X

దిశ, వెబ్ డెస్క్: కలకత్తా ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ను న్యాయస్థానం దోషిగా పేర్కొంటూ జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే విచారణలో భాగంగా సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులోని కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలి మృతదేహంపై వేరే మహిళ DNA ఉన్నట్లు అందులో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో దోషిగా తేలిన సంజయ్‌రాయ్‌ DNA మృతురాలి శరీరంపై 100 శాతం ఉండగా, అతికొద్ది స్థాయిలో ఓ మహిళ DNA సైతం బయటపడింది. దీంతో అది పొరపాటున ఈ DNAతో కలిసిందా? లేక సదరు మహిళ కూడా ఈ నేరంలో భాగమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


కేసులో మరికొందరి ప్రమేయం

మరోవైపు జూనియర్ వైద్యురాలి తండ్రి ఈ కేసులో మరికొందరు ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్‌ సేకరించలేదని.. కేసు ఛేదించడానికి CBI సరిగ్గా ప్రయత్నించడం లేదన్నారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా DNA రిపోర్టులో వెల్లడైందని అధికారులు తనకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

మరణ శిక్ష విధించాలి

2024, ఆగస్టు 9న రాత్రి ఆర్జీకర్‌ ఆస్పత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూ.వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆస్పత్రిలోని CCTVలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి, జీవిత ఖైదు విధించింది. అయితే శిక్ష ఖరారు చేయడానికి ముందు.. తాను ఏ నేరం చేయలేదని ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించారని సంజయ్‌ తన వాదనలు వినిపించాడు. ఇక జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని కోరుతూ.. బెంగాల్‌ ప్రభుత్వం మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

Next Story