వృద్ధురాలి పై దాడి.. బంగారు గొలుసు చోరీ..

by Disha Web Desk 20 |
వృద్ధురాలి పై దాడి.. బంగారు గొలుసు చోరీ..
X

దిశ, వైరా : కిరాణా దుకాణంలో వ్యాపారం నిర్వహిస్తున్న వృద్ధురాలి పై గుర్తుతెలియని దుండగుడు రాయితో దాడిచేసి ఆమెమెడలో బంగారపు గొలుసును అపహరించిన సంఘటన సోమవారం సాయంత్రం వైరాలో జరిగింది. వైరాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న శ్రీ సాయి శ్రీనివాస కిరాణం దుకాణంలో వజినేపల్లి గృహలక్ష్మి అనే వృద్ధురాలి పై గుర్తుతెలియని అగంతకుడు రాయితో దాడి చేసి ఆమెమెడలోని సుమారు నాలుగు తులాల బంగారపు గొలుసును అపహరించాడు. వైరాకు చెందిన వజినేపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో శ్రీ సాయి శ్రీనివాస కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం తర్వాత శ్రీనివాసరావు భోజనం చేసేందుకు దుకాణం నుంచి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో దుకాణంలో ఆయన తల్లి వజినేపల్లి గృహలక్ష్మిని ఉంచాడు.

అయితే పల్సర్ ద్విచక్ర వాహనం పై వచ్చిన గుర్తుతెలియని దుండగుడు కిరాణా దుకాణంలోకి ప్రవేశించి కిరాణాసరుకులు కావాలని గృహలక్ష్మిని అడిగాడు. అనంతరం వెంటనే ఆ అగంతకుడు తనవెంట తెచ్చుకున్న రాయితో గృహలక్ష్మి తలపై దాడి చేయడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే ఆ దొంగ ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించి ద్విచక్ర వాహనం పై పరారయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైరా సీఐ సురేష్ ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ కిరాణా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డింగ్ వీడియో ఫుటేజీలను పోలీస్ అధికారులు పరిశీలించారు. చోరీకి గురైన బంగారపు గొలుసు విలువ సుమారు రెండున్నర లక్షలు రూపాయలు ఉంటుందని అంచనా.

Next Story

Most Viewed