మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డిలపై ప్రశ్నల వర్షం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-25 17:16:11  IST  )

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ విచారణ రెండో రోజు అత్యంత కీలకంగా మారింది.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డిలపై ప్రశ్నల వర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో రెండో రోజు సిట్ (SIT) కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డిలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న నమిత్ శర్మను ప్రత్యేకంగా విచారించారు. రెండో రోజు విచారణలో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచి, పలు ప్రశ్నలపై నిందితుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసినట్లు సమాచారం.

కోర్టు మూడు రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో, సిట్ అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా వ్యవహారం, పార్టీలో పాల్గొన్న వారి పాత్ర, అలాగే కాల్పుల ఘటనపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. డ్రగ్ పెడ్లర్లు, మధ్యవర్తులు, పార్టీ నిర్వాహకుల మధ్య ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరుగుతోంది. నగరానికి వెలుపల ఉన్న ఈ ఫామ్‌హౌస్‌ను డ్రగ్స్ పార్టీకి వేదికగా ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అనే అంశంపై కూడా సిట్ ఆరా తీస్తోంది.

కాల్పుల ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన గన్ ఫైరింగ్ ఘటనపై నిందితుల స్టేట్‌మెంట్లను సిట్ నమోదు చేసింది. ఈ కాల్పులు ప్రమాదవశాత్తు జరిగాయా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాల్పులకు దిగారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలపై ఫోరెన్సిక్ పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. నిందితుల కాల్ డేటా రికార్డులు (CDR), వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్లను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్ నెట్‌వర్క్, కాల్పుల ఘటన, ఆర్థిక లావాదేవీలు అనే మూడు కీలక కోణాల్లో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కస్టడీ విచారణ పూర్తయ్యేలోపు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Next Story