గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఖతం

by Kema Shiva Kumar |

పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో నలుగురు కరుడుగట్టిన నేరస్థులు హతమయ్యారు.

గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్..  నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఖతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) పరిధిలోని సైబర్ సిటీ గురుగ్రామ్‌లో ఇవాళ తెల్లవారుజామున బుల్లెట్ట వర్షం కురిసింది. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లకు, గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మధ్య జరిగిన ఈ హోరాహోరీ కాల్పుల్లో నలుగురు దుండగులు అక్కడికక్కడే హతమవ్వగా, ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య దాదాపు 60 రౌండ్లకు పైగా బుల్లెట్లతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది.

సినిమా ఫక్కీలో ఛేజింగ్..

పోలీసుల పక్కా సమాచారం మేరకు.. కీలక హత్యలు, దోపిడీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఓ ముఠా గురుగ్రామ్ (Gurugram) మీదుగా పారిపోయేందుకు ప్లాన్ చేసింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ బృందాలు సదరు గ్యాంగ్‌స్టర్ల కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. అయితే, పోలీసులను చూసి లొంగిపోవడానికి బదులుగా దుండగులు వేగంగా కారును పోనిస్తూ, పోలీసులపైకి నేరుగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటాడారు. ఓ నిర్మానుష్య ప్రాంతం వద్ద దుండగుల కారును పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ, గ్యాంగ్‌స్టర్లు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలతో పోలీసులపైకి ఎదురుకాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య దాదాపు అర గంటకు పైగా సాగిన ఈ కాల్పుల్లో మొత్తం 60 రౌండ్ల బుల్లెట్లు కురిశాయి. చివరకు పోలీసుల వ్యూహాత్మక కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా, దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌లో పోలీసులు పెద్ద ఎత్తున ఆటోమేటిక్ రైఫిళ్లు, వందలాది లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story