కొకైన్ ​దందా చేస్తూ పట్టుబడ్డ సినీ నిర్మాత

by Dishafeatures2 |
కొకైన్ ​దందా చేస్తూ పట్టుబడ్డ సినీ నిర్మాత
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/రాజేంద్రనగర్​: డ్రగ్స్​ దందా చేస్తున్న సినీ నిర్మాతను మాదాపూర్​ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కొకైన్​తో సహా మొత్తం 78లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్​జోన్​ డీసీపీ జగదీశ్వర్​ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాదక ద్రవ్యాల నిరోధానికి ఇటీవలిగా సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గంజాయి, హెరాయిన్, కొకైన్​ తదితర డ్రగ్స్​ విక్రేతలు, కొనుగోలుదారులపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ క్రమంలో రజనీకాంత్​ హీరోగా నటించిన కబాలి తెలుగు వర్షన్​ సినిమాకు నిర్మాతగా

వ్యవహరించిన సుంకర కృష్ణప్రసాద్ చౌదరి కొకైన్​ విక్రయిస్తున్నట్టుగా మాదాపూర్​ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. అతనిపై నిఘా పెట్టిన ఎస్వోటీ అధికారులు మంగళవారం సాయత్రం రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి కిస్మత్​పూర్​ చౌరస్తా వద్ద కొకైన్​ అమ్ముతుండగా దాడి చేసి రెడ్​ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన కృష్ణప్రసాద్​బీటెక్​చదివాడు. ఆ తరువాత పూణెలోని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఏరోనాటికల్​ ఇంజనీరింగ్​అండ్​టెక్నాలజీలో ఆపరేషన్స్​ డెరెక్టర్ గా పని చేశాడు. 2016లో ఉద్యోగం వదిలేసిన కృష్ణప్రసాద్​ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కబాలి తెలుగు వర్షన్​ సినిమాకు నిర్మాతగా వ్యవహరించటంతోపాటు సర్ధార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కనితన్ (అర్జున్​ సురవరం) సినిమాలను డిస్ర్టిబ్యూట్​ చేశాడు. అయితే, దీంట్లో ఆశించిన లాభాలు అతనికి రాలేదు. అయితే, టాలీవుడ్​లోని సెలెబ్రెటీలతో పరిచయాలు మాత్రం ఏర్పడ్డాయి.

ఇక, సినిమాల్లో లాభాలు రాకపోవటంతో గోవా వెళ్లిన కృష్ణప్రసాద్​ ఓహెచ్ఎం క్లబ్​ను ప్రారంభించాడు. గోవాకు వచ్చే స్నేహితులు, సెలెబ్రెటీలతో కలిసి డ్రగ్స్​ తీసుకునేవాడు. ఇక, క్లబ్బులో కూడా నష్టాలు రావటంతో ఏప్రిల్​ నెలలో హైదరాబాద్​ కు వచ్చిన కృష్ణప్రసాద్​ వస్తూ వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ ను నైజీరియా దేశానికి చెందిన పెటిట్​ఎబుజెర్ ​ఎలియాస్​గాబ్రియెల్​నుంచి కొని తీసుకొచ్చాడు. ఇలా తీసుకొచ్చిన కొకైన్​లో పది ప్యాకెట్లను తాను తీసుకోవటంతోపాటు కొంతమంది స్నేహితులకు అమ్మాడు. ఇదేవిధంగా కిస్మత్​పూర్​చౌరస్తాలో కొకైన్​అమ్మేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుని నుంచి 82.75 గ్రాముల కొకైన్​తోపాటు నాలుగు మొబైల్​ ఫోన్లు, బెంజ్​ కారును స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ జగదీశ్వర్​ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నైజీరియన్​పెటిట్​ఎబుజెర్​కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నిందితున్ని పట్టుకున్న ఎస్వోటీ అధికారులను అభినందించారు.


Next Story

Most Viewed